సూర్యాపేట, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : అధికారంలోకి రావాలనే అత్యాశతో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ప్రభుత్వానికి గుదిబండలయ్యాయని కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలంటే ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. ప్రభు త్వం నడపడం చేతగాక బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని పిచ్చిపిచ్చి ఉత్తరాలు రాయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లేకపోతే హామీల అమలుపై నిలదీసే వారుండరని కాంగ్రెస్ భ్రమపడుతుందని విమర్శించారు.
శుక్రవారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చే నమ్మకం లేక కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చిందని తాము ఎన్నికల సమయంలోనే చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్లే సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని ప్రజలు మదనపడుతున్నారని అన్నారు. రైతుబంధు ఏ పద్ధతిలో ఇస్తారో ఇప్పటికీ ప్రకటించలేదని మండిపడ్డారు. ‘కాంగ్రెస్ వచ్చింది.. కరెంటు పోయింది’ అని ప్రజలు ఇప్పటికే చర్చించుకుంటున్నారని తెలిపారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తామన్న కాంగ్రెస్ ఆ హామీని అటకెక్కించి ప్రజల నుంచి ముక్కు పిండి బిల్లులు వసూలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన చేత కాకపోతే అనుభవజ్ఞుల సహాయం తీసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు.