సూర్యాపేట : తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తుంది. మంత్రులకు పాలన చేతకాక పోలీసులను ముందుపెడున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడి అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.
ప్రజలనుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసులను అడ్డుపెట్టుకొని పాలన సాగిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా పైన అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
యూరియా లైన్ వీడియో తీసి పెట్టినా.. కేసులు పెట్టడం దుర్మార్గం అన్నారు. అర్ధం లేని కేసులో అర్ధరాత్రి అరెస్టులు అక్రమం. ఓ తాగుబోతు ఇచ్చిన పిర్యాదుతో మాపార్టీ సీనియర్ నాయకున్ని అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజల ఒత్తిడితోనే ఈరోజు పోలీసులు తలొగ్గిండ్రు. చట్టవిరుద్దంగా పోలీసులు నడుచుకోవద్దని హితవు పలికారు. ఇలాంటి ఉద్యమాలు కేవలం కార్యకర్తలను విడిపించుకోవడం కోసమే కాదు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీల్లో మీరు చేస్తున్న మోసాలు ఒకటొకటిగా ఎండగడతామన్నారు. కేసులు మాకు కొత్త కావు..
ప్రజా ఉద్యమాలు మొదలైతే.. పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరన్నారు. ప్రజల అండ ఉన్నంతవరకు ఇటువంటి కేసులు భయపెట్టలేవని పేర్కొన్నారు. సూర్యాపేట, నల్లగొండ ఎస్పీలకు మరోమారు చెబుతున్న.. లా అండ్ ఆర్డర్ అదుపుతప్పొద్దు. పోలీస్ అధికారులను చట్ట ప్రకారం పని చేసేటట్టు చూసుకోవాలన్నారు. ఒకపక్క గంజాయి మూకలతో సమాజం తప్పుదోవ పడుతుంది. ముందు వాటిపై దృష్టి పెట్టండి. ఈ అక్రమ కేసులపై పెట్టే శ్రద్ధ యూరియా ఇవ్వడంపై పెడితే బాగుంటుందన్నారు.