యాదాద్రి భువనగిరి : రామన్నపేటలో(Ramannapet) నిర్మించ తల పెట్టిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై (Ambuja Cement Factory) ప్రజాభిప్రాయ సేకరణకు(Plebiscite) వెళ్తున్న మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, రవీందర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి నేడు జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ ఒక ప్రహసనం అన్నారు. ప్రజల మధ్య జరపకుండా ఎక్కడో మారుమూలలో దొంగ చాటుగా రాసుకోడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మా అభిప్రాయాలు చెప్పడానికి వెళ్తున్న ప్రజా ప్రతినిధులను అడ్డగిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా ప్రజలను, ప్రజాసంఘాల నాయకులను, ప్రజా ప్రతినిధులను, పార్టీల నాయకులను అరెస్ట్ చేసి ఏ ప్రజల అభిప్రాయాలు తీసుకుంటారని ప్రశ్నించారు. నల్లగొండ, యాదాద్రి, రాచకొండ కమిషనరేట్ పోలీస్ అధికారులు, జిల్లా కలెక్టర్లు ఈ నిర్భందాలకు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. రేవంత్ రెడ్డి పరిపాలనకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. కోదండరాం, హరగోపాల్ ఇప్పుడైనా గొంతులు విప్పుతారా? అని నిలదీశారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రజలందరూ వాళ్ల అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పే వాతావరణం కల్పించి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని డిమాండ్ చేశారు. నిర్భందించిన ప్రజా ప్రతినిధులను వెంటనే విడుదల చేయాలన్నారు.