సూర్యాపేట, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం సాగుకు నీళ్లిస్తామని హామీ ఇవ్వడం వల్లే రైతులు పంటలు వేశారని, ఇచ్చిన మాటకు కట్టుబడకుండా మోసం చేసి రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎండిపోతున్న పంటలను పరిశీలిస్తున్న ఆయన ఐదో రోజైన గురువారం సూర్యాపేట మండలం యర్కారం, దుబ్బతండా, రేఖ్యానాయక్తండాల్లో ఎండిన పొలాలను పరిశీలించారు.
రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కళకళలాడిన పంట పొలాలు నేడు మోడువారడానికి కారణం నూటికి నూరు శాతం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని దుయ్యబట్టారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేస్తే మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీరాంసాగర్ ఫేజ్-2 ద్వారా నీళ్లు ఇస్తామంటేనే పంటలు వేశారని, హామీ ఇచ్చి పంటలకు నీరు ఇవ్వకుండా రైతాంగాన్ని కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని నమ్మి ఒక్కో రైతు ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల పెట్టుబడి పెట్టి ఆగమయ్యారని తెలిపారు. కాళేశ్వరం నీళ్లు ఎత్తి పోయడానికి కుంగిన మూడు పిల్లర్లకు సంబంధం లేకపోయినప్పటికీ కేవలం గత ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.
తమ ప్రభుత్వంలో రైతు తప్పిదంతో ఒక్క మడి ఎండిపోతేనే నానా హంగామా చేసిన ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. ఇప్పుడు ఎండిపోతున్న పొలాలపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోతూ రైతులు రోడ్డున పడుతుంటే మంత్రులు కనీసం సమీక్ష చేయకపోవడం.. రైతులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలుపుతుందని పేర్కొన్నారు.
ఎకరాకు రూ. 20 వేలు చెల్లించాలి
వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల దాదాపు 2 లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నదని చెప్పారు. ఏడాదిలోనే మూడుసార్లు కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. వానాకాలంలో 12 లక్షల ఎకరాల్లో, యాసంగిలో మిచాంగ్ తుఫాన్ వల్ల 4.70 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తమ్మినేని గుర్తుచేశారు. మారెట్కు వచ్చిన ధాన్యం కూడా తడిసిపోయిందని, తక్షణమే నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల పరిహారం చెల్లించి, రుణమాఫీని ప్రకటించాలని తమ్మినేని కోరారు.