నల్లగొండ ప్రతినిధి/యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ దుర్మార్గ పాలనతో 100 రోజుల్లోనే తెలంగాణ ప్రజలు తిరగబడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. మార్పు తెస్తామంటే నమ్మి ప్రజలు అధికారం అప్పగిస్తే పాలన చేతగాక కాంగ్రెస్ నేతలు చిల్లర మాటలతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. రోజుకో డ్రామాతో సినిమా డైలాగులను తలపిస్తూ సాగుతున్న రేవంత్రెడ్డి పాలనను ప్రజలు ఈసడించుకుంటున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక లోక్సభ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని, ప్రజలంతా దీన్ని గమనించాలని పిలుపునిచ్చారు. శనివారం భువనగిరి లోక్సభ స్థానం పరిధిలోని నకిరేకల్, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాల బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ లోపాయికారిగా ఒక్కటై పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఒకరి గెలుపు కోసం మరొకరు డమ్మీ అభ్యర్థులను పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నట్టు మండిపడ్డారు.
కాంగ్రెస్ చెప్పిన 420 హామీలను అమలు చేయలేక రేవంత్రెడ్డి నోటికి పనిచేప్తూ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన 15 వేల రైతు భరోసా, రూ.2 లక్షల రుణమాఫీ, రూ.500 బోనస్, తులం బంగారంతో కల్యాణలక్ష్మి, మహిళలకు రూ.2,500, విద్యార్థులకు రూ.ఐదు లక్షల కార్డు, విద్యార్థినులకు స్కూటీల హామీలు ఎటుపోయాయని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కరువు, సాగునీళ్లు, నిరంతర కరెంటు, తాగునీళ్లు ఇవ్వలేక, ధాన్యాన్ని కొనలేని, గిట్టుబాటు ధర చెల్లించలేని అసమర్ధతను కప్పుపుచ్చుకోవడానికి సీఎం, మంత్రులు నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలకులు ఎన్ని డ్రామాలకు తెరలేపినా ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అసమర్థ పాలనకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని హెచ్చరించారు. నల్లగొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో గులాబీ జెండా ఎగిరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఆయా సమావేశాల్లో బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్ధి క్యామ మల్లేశ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, గొంగిడి సునీత మహేందర్రెడ్డి, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్లు బండా నరేందర్రెడ్డి, ఎలిమినేటి సందీప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, పార్టీ రాష్ట్ర నేతలు ఒంటెద్దు నర్సింహారెడ్డి, దూదిమెట్ల బాలరాజుయాదవ్, డాక్టర్ చెరుకు సుధాకర్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, రాష్ట్ర నాయకుడు సుదగాని హరిశంకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.