హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ఆటోకార్మికుల మరణాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించకపోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఆటోకార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడకూడదని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ‘ఆటో నడవటం లేదని మనస్తాపంతో, బతుకు భారమై భార్యతో సహా, ప్రాణాలు కోల్పోయిన ఆటో సోదరుడి హృదయ విదారక ఘటన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిలించకపోవడం బాధాకరం.
తల్లి, తండ్రిని కోల్పోయి, అనాథగా మారిన ఆ బిడ్డ భవిష్యత్తుకు ఎవరు బాధ్యత వహిస్తారు ? ఎవరు భరోసా ఇస్తారు? నిజామాబాద్లో జరిగిన ఈ ఘటన పై ప్రభుత్వం తక్షణం స్పందించి రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. రాష్ట్రంలో వరుసగా ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. నిర్లక్ష్యం వీడి, ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్ల జీవన సమస్యకు పరిషారం చూపాలి. రూ. 12 వేల భృతి ప్రకటించాలి. ఆటో సోదరులు ధైర్యంగా ఉండాలి. తొందరపాటు చర్యలకు పాల్పడవద్దు’ అని కోరుతూ హరీశ్రావు ట్వీట్ చేశారు.