హైదరాబాద్, మే12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కక్షకు, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు శిక్ష అనుభవిస్తున్నారు. నెలలు గడిచినా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. రేపు, మాపు అంటూ తాత్సారం చేస్తున్నారు. గట్టిగా నిలదీస్తే అసలు ఇచ్చేదే లేదంటూ ఏకంగా బెదిరింపులకు దిగుతున్నారని ఏఈ (అస్టిస్టెంట్ ఇంజినీర్లు), జేటీవో (జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు)లుగా ఎంపికైన బాధిత అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ తదితర విభాగాల్లో దాదాపు 833 ఏఈ, జేటీవో పోస్టుల భర్తీకి 2022లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. అందులో నీటి పారుదలశాఖకు 439 పోస్టులు ఉన్నాయి.
గత అక్టోబర్లో రాతపరీక్ష నిర్వహించగా, ఫిబ్రవరిలోనే ఫలితాలు వెల్లడించారు. అపాయింట్మెంట్ ఆర్డర్లను అందుకుని విధుల్లో చేరేందుకు వారంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. కానీ ముఖ్యమంత్రే రావాలి? ఆయనే నియామకపత్రాలివ్వాలి అంటూ ఆ తంతును సర్కారు నిర్వహించడమే లేదు. తొలుత ఏప్రిల్ 14న, ఆ తర్వాత 28, మే 2, అదే నెల 7వ తేదీన అని వాయిదాలు వేస్తూ వస్తున్నారు. నియామకపత్రాల పంపిణీ కోసం జలసౌధ ప్రాంగణంలో టెంట్లను కూడా ఏప్రిల్ 28నే వేశారు. ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయి. కానీ కార్యక్రమ తేదీ మాత్రం నిర్ణయించడం లేదు. ఇదేమని ఉన్నతాధికారులను అడిగితే సీఎం రేవంత్రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, ఈ నేపథ్యంలోనే వాయిదా వేస్తున్నట్టు తమ అశక్తతను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, గ్రౌండ్వాటర్ తదితర విభాగాలకు తమతోపాటు ఎంపికైన వారు ఇప్పటికే విధుల్లో చేరి వేతనాలను కూడా పొందుతున్నారని ఏఈ, జేటీవోలుగా ఎంపికైన అభ్యర్థులు వాపోతున్నారు.
నీటిపారుదల శాఖలో ఏఈ, జేటీవోలుగా ఎంపికైన వారికి నియామకపత్రాలు ఇవ్వకపోడంపై బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి హరీశ్రావు ఘాటుగా స్పందించారు. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడానికి కూడా సమయం దొరకడం లేదా? అంటూ సీఎం రేవంత్రెడ్డిని, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని నిలదీశారు. ఇదే ప్రభుత్వ పెద్దలకు చిర్రెత్తుకొచ్చినట్టుగా అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ కారణంగా నియామకపత్రాలు ఇవ్వకుండా మరోవిధంగా కక్షసాధింపు మొదలు పెట్టారని ఆరోపిస్తున్నారు. అభ్యర్థులపైనే ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. నియామకపత్రాలు ఇవ్వకుంటే ప్రతిపక్ష నేతలతో ఎలా మాట్లాడిస్తారు? అంటూ అభ్యర్థులపైనే మండిపడుతున్నారు. వారు మాట్లాడితే పత్రాలు ఇచ్చేదే లేదంటూ ఏకంగా బెదిరింపులకు దిగుతున్నారని అభ్యర్థులు చెప్తున్నారు. ఇప్పటికైనా తమకు పత్రాలను అందించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.