హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు జిల్లాలో కురిసిన వడగళ్ల వర్షం వల్ల నష్టపోయిన బాధితులకు అండగా నిలవాలని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు (MLA Harish Rao ) బీఆర్ఎస్ (BRS) ప్రజాప్రతినిధులు, నాయకులను ఆదేశించారు. వడగళ్ల బీభత్సంపై ఢిల్లీ నుంచి మంగళవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ (Teleconference) లో ఆయన మాట్లాడారు.
బాధితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శించి వారిలో ధైర్యం నింపాలని ఇందు కోసం యుద్ధప్రాతిపదికన ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.పార్టీ నుంచి సహాయం అందించి ప్రజలకు అండగా నిలవాలన్నారు. అకాల వర్షానికి నష్టపోయిన పంటకు ఎకరానికి రూ. 10 వేలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు మున్సిపల్(Muncipal), రెవెన్యూ(Revenue) అధికారులతో మాట్లాడి తక్షణ సహాయం అందించాలని కోరారు. భారీ వర్షానికి కూలిన పాత ఇళ్లను పరిశీలించాలని అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే హరీష్ రావు రెవెన్యూ, వ్యవసాయ,ఉద్యాన వన శాఖ, విద్యుత్, మున్సిపల్ అధికారులతో ఫోన్ లో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి సిద్దిపేట పట్టణం లో చెట్లు, పలు రోడ్లు, అక్కడక్కడ విద్యుత్ స్థంభాలు వైర్లు కింద పడ్డాయని అన్నారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు వార్డుల్లో పర్యటించి బాధితుల వద్దకు వెళ్లి వారిని పలకరించి ఆదుకోవాలని సూచించారు.