హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకొని, వారికే ఎంపీ టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నైతికత గురించి మాట్లాడటం సిగ్గుచేటని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్ చరిత్రలోనే లేదని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి హరీశ్రావు శుక్రవారం బహిరంగలేఖ రాశారు. ఆరు గ్యారెంటీల పేరుతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు మాట్లాడే నైతిక హక్కులేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకొచ్చి 4 నెలలైనా ఒక్క హామీనీ నెరవేర్చలేదని విమర్శించారు.
ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు అరచేతిలో స్వర్గం చూపిస్తూ హామీలు ఇవ్వడం, ఆ తర్వాత వాటిని అమలు చేయలేక చేతులెత్తేయడం కాంగ్రెస్కు మామూలేనని, ఈ విషయం ఎన్నోసార్లు రుజువైందని హరీశ్ ఆ లేఖలో ఆరోపించారు. 2004, 2009 ఎన్నికల సందర్భంగా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానినీ అమలుచేయలేదని గుర్తుచేశారు. తెలంగాణలోనూ ఇప్పు డు హామీలను విస్మరించారని ధ్వజమెత్తారు. మళ్లీ ఇప్పుడు ఏ నైతికత ఉందని మ్యానిఫెస్టో విడుదలకు వస్తున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ చాప్టర్లోని 13వ పాయింట్ కింద ప్రజాప్రతినిధులు ఎవరైనా పార్టీ మారితే ఆ వెంటనే సభ్యత్వం పోయేలా చట్టం చేస్తామని ఈసారి మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారని, మ్యానిఫెస్టో ఇలా విడుదల చేశారో? లేదో? తెలంగాణలో అందుకు భిన్నంగా జరిగిందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని వారికే ఎంపీ టికెట్లు ఇచ్చారని, అలాంటి మీరు ఫిరాయింపుల గురించి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆరు గ్యారెంటీల పేరుతో హామీలు గుప్పించారని, మాది గ్యారెంటీ అని, వారెంటీ మీరు, ప్రియాంకగాంధీ, ఖర్గే ట్వీట్లు చేశారని గుర్తుచేశారు. మీపై నమ్మకంతో గెలిపించిన ప్రజలను మోసం చేశారని, 90 రోజుల్లో హా మీలు అమలుచేస్తామని చెప్పి 120 రోజులైనా హామీలు నెరవేరలేదని విమ ర్శించారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలోని మొట్టమొదటి హామీ అయిన మహాలక్ష్మి పథకం నుంచి చివరి హామీ అయిన చేయూత పథకం వరకు కాంగ్రెస్ అన్నింటినీ విస్మరించిందని లేఖలో హరీశ్ మండిపడ్డారు. మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు నెలకు రూ. 2,500 చొప్పున బ్యాంకు అకౌంట్లో జమ చేస్తామని చెప్పారని, కానీ నేటి వరకు ఒక మహిళకు కూడా ఆర్థికసాయం అందలేదని పేర్కొన్నారు. మీ తల్లి సోనియాగాంధీ పుట్టిన రోజైన డిసెంబర్ 9న రైతులకు రుణమాఫీ చేస్తామని ఇప్పటికీ దానిగురించి మాట్లాడటం లేదని విమర్శించారు. తుక్కుగూడ సభలోనైనా రూ. 2 లక్షల రుణమాఫీకి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయాలని రైతుల పక్షాన కోరుతున్నట్టు పేర్కొన్నారు.
రైతుబంధు రూ. 15 వేలు, పంటలకు క్వింటాలుకు రూ. 500 బోనస్, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు వంటి వాటిపై నేటికీ స్పష్టత లేదని తెలిపారు. 24 గంటల ఉచిత విద్యుత్ అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అధికారంలోకొ చ్చాక రాష్ట్రంలో ఇప్పటివరకు 210 మం ది రైతులు మరణించారని తెలిపారు. దీనికి కారకులైన మీరు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రూ. 4 వేల పెన్షన్, నిరుద్యోగులకు రూ. 4 వేల భృతి, ఆటోకార్మికులకు రూ. 12 వేలు వంటివేవీ అమలుకావడం లేదని లేఖలో పేర్కొన్నారు.