Harish Rao | సంగారెడ్డి : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. బీజేపీకి నచ్చినోళ్లు వారి జేబుల్లో ఉండాలి.. నచ్చనోళ్లు జైల్లో ఉండాలి.. కవితతో పాటు కేజ్రీవాల్ను అరెస్టు చేశారు. లొంగకపోతే ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని హరీశ్రావు మండిపడ్డారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన మెదక్ పార్లమెంట్ సమావేశంలో హరీశ్రావు పాల్గొని ప్రసంగించారు.
కేసీఆర్ బీజేపీతో ఎప్పుడూ కలిసేది లేదు.. బీఆర్ఎస్ లౌకిక పార్టీ అని హరీశ్రావు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రచారం చేశారు. కానీ ఇవాళ ఏం జరుగుతుందో మీరంతా చూస్తున్నారు. బీజేపీ ఏ ఒక్కరిలోనూ మార్పు తేలేదు. బీఆర్ఎస్ గెలవాలి.. తెలంగాణ నిలవాలి అనే నినాదంతో ఎన్నికల ప్రచారం చేయాలి. తెలంగాణ కోసం నిఖార్సుగా పోరాడే పార్టీ బీఆర్ఎస్. కాంగ్రెస్, బీజేపీకి 100 ఎజెండాలు ఉంటాయి. వారి అవసరాల కోసం కాంప్రమైజ్ అవుతాయి. తెలంగాణ హక్కుల కోసం ఎలాంటి రాజీ లేకుండా పోరాటం చేసే పార్టీ బీఆర్ఎస్ అని ప్రజల్లోకి తీసుకోవాలి. రాత్రింబవళ్లు కష్టపడి గులాబీ జెండాను గెలిపించుకుందాం అని హరీశ్రావు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ముస్లింలకు పెద్ద పీట వేశారని హరీశ్రావు గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం, రెవెన్యూ , హోం మినిస్టర్ పదవి ముస్లింలకు ఇచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం మంత్రులెవరూ లేరు. గతంలో బడ్జెట్లో కూడా అధిక కేటాయింపులు చేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలకు బట్టలు పంపిణీ చేశారు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేశారు. పిల్లలు గొప్పగా చదువుకుంటున్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే లాభం లేదు. సెక్యూలర్ పార్టీ బీఆర్ఎస్. సెక్యులర్ నాయకుడు కేసీఆర్. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడం కాదు.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నాం. ప్రతిపక్ష నాయకులను బెదిరించి, అక్రమ కేసులు పెట్టి, కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మోసాలను తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. వెంకట్రామిరెడ్డికి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి అని హరీశ్రావు కోరారు.