Harish Rao | కొడంగల్ : అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిప్పులు చెరిగారు. ఆడ పిల్లల పెళ్లిళ్లకు ఇస్తామన్న తులం బంగారం హామీ ఏమైందంటూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీని హరీశ్రావు సూటిగా ప్రశ్నించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో హరీశ్రావు పాల్గొని ప్రసంగించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. మొదటి సంతకం ఆరు గ్యారెంటీల మీదనే చేస్తామన్నారు. అసెంబ్లీలో ఆ గ్యారెంటీలకు చట్టబద్దత కూడా చేస్తామన్నారు. కానీ ఏది జరగలేదు. ఇదే కోస్గిలో ప్రియాంక గాంధీ వచ్చి ఏం మాట్లాడారు. అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్లకు కేసీఆర్ ఇచ్చే లక్షతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డి ఇవ్వకపోతే తులం బంగారం ఇచ్చే జిమ్మేదార్ నాది అన్నారు. మరి ఏమైందమ్మా ప్రియాంక గాంధీ తులం బంగారం సంగతి..? ఇప్పుడు లగ్గాల సీజన్ నడుస్తోంది. మార్చి, ఏప్రిల్లో ఫుల్ లగ్గాలు అయినాయి. కొడంగల్లో ఎవరికన్న తులం బంగారం వచ్చిందా..? మరి ఇప్పుడు ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు. తులం బంగారం ఇస్తామన్న రేవంత్, ప్రియాంక ఎక్కడికి పోయారు..? ఇది మోసం కాదా..? అని హరీశ్రావు ధ్వజమెత్తారు.
రెండు లక్షల రుమాఫీ ఒక్కరికైనా అయిందా..? రుణమాఫీ అయినొళ్లంతా కాంగ్రెస్కు ఓటేయండి.. రుణమాఫీ కానోళ్లంతా కారు గుర్తుకు ఓటేయండి. వడ్లకు బోనస్ రూ. 500 అన్నాడు. కోస్గి మార్కెట్లో వడ్లు రూ. 2200 లకే అమ్ముడు పోతున్నాయి. బోనస్ 500 అన్నాడు.. మరి రూ. 2700లకు కొనాలి కదా..? ముచ్చట్లతో ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుని మోసం చేస్తున్నారు. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే లోపే రైతుబంధు 15 వేలు ఇస్తామన్నాడు. పదిహేను వేలు ఎవరికైనా వచ్చాయా..? రైతులకు ఆరు ముచ్చట్లు చెప్పి ఒక్కటి కూడా అమలు చేయలేదు. రూ. 2 లక్షల రుణమాఫీ, బోనస్ 500, రైతుబంధు రూ. 15 వేలు, కౌలు రైతులకు రూ. 15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు, 24 గంటల కరెంట్ అన్ని మోసమే. ఒక్కటి కూడా అమలు చేయలేదు. మోసం చేసిన కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అసవరం ఉందని హరీశ్రావు అన్నారు.
పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగమైన కరివెన ప్రాజెక్టు పూర్తయింది. అక్కడ్నుంచి కొడంగల్కు కాల్వలు తవ్వడానికి టెండర్లు పిలిచాం. గట్టిగ పని చేస్తే మూడు నుంచి ఆరు నెలల్లో పూర్తవుతాయి.ఆ కాల్వలు తవ్వితే లక్షా 30 వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి. కానీ ఆ టెండర్లను రేవంత్ రెడ్డి రద్దు చేసి కాలయాపన చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని హరీశ్రావు పేర్కొన్నారు.