దళితుల హృదయాల్లో సీఎం కేసీఆర్
దళితజాతి అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అహోరాత్రులు శ్రమించి దళితబంధు పథకాన్ని తెచ్చారని ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. దళితబంధు పథకంతో సీఎం కేసీఆర్ దళితుల గుండెల్లో కొలువైన దేవుడిగా ఎల్లకాలం నిలిచిపోతారని తెలిపారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను చూసిన సరిహద్దు రాష్ర్టాల ప్రజలు ఇలాంటి ముఖ్యమంత్రి తమకు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారని చెప్పారు. తన నియోజవర్గం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకు సరిహద్దుగా ఉంటుందని ఆ రాష్ర్టాల ప్రజలు ఇక్కడ అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ముచ్చటపడుతున్నారని వెల్లడించారు.
–ఎమ్మెల్యే హన్మంత్ షిండే
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తరతరాలుగా అణచివేతకు గురైన దళితుల సర్వతోముఖాభివృద్ధికోసం రాష్ట్రప్రభుత్వం తెచ్చిన దళితబంధు పథకంపై కొంతమంది రాజకీయ నాయకులు ఈర్ష్యపడుతున్నారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు విమర్శించారు. ఈ పథకం అమలైతే రాజకీయంగా ఉనికి కోల్పోతామనే భయంతో ఇతర వర్గాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లాంటివాళ్లు అపశకునపు పక్షుల్లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పొద్దుపోక పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే హన్మంత్ షిండేతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దళితబంధు పథకంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైందని చెప్పారు. తెలంగాణ పథకాలను అధ్యయనం చేసేందుకు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు స్టడీ టూర్లు నిర్వహిస్తున్నాయన్నారు. దళితబంధు దేశానికి మార్గదర్శనం చేస్తుందని పేర్కొన్నారు. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా పథకం ఆగదని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు దశలవారీగా వర్తింపజేస్తామని తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపికచేసిన సీఎం కేసీఆర్, తాజాగా నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో దళితబంధును అమలు చేస్తామని ప్రకటించటంపట్ల హర్షం వ్యక్తంచేశారు. ఆ నాలుగు మండలాల్లో తన నియోజకర్గంలోని మండలం కూడా ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.