హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించడం.. ఆ మహానీయుడి ఆత్మను క్షోభ పెట్టడమేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎల్పీలో గువ్వల బాలరాజు మీడియాతో మాట్లాడారు. నిన్న ఢిల్లీ వేదికగా చేపట్టిన టీఆర్ఎస్ నిరసన దీక్ష విజయవంతం కావడంతో బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారని గువ్వల బాలరాజు పేర్కొన్నారు.
ఒకట్రెండు విజయాలు సాధించగానే బీజేపీ నేతలు ఎగిరెగిరి పడుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ సాధించిన విజయాల ముందు బీజేపీ సాధించింది ఎంత? అని ప్రశ్నించారు. బీజేపీ సిట్టింగ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కోల్పోలేదా? హుజుర్నగర్ ఉప ఎన్నికలో బీజేపీ సాధించిన ఓట్లు ఎన్ని? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ బీజేపీకి అమ్ముడు పోయిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బండి సంజయ్ను రైతులే నిలదీస్తారని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడం ఖాయమన్నారు. తెలంగాణ రైతులు ఆగ్రహావేశాలకు లోనైతే.. బండిని రాళ్లతో కొట్టి చంపడం ఖాయమని గువ్వల బాలరాజు పేర్కొన్నారు.