హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): బీసీ కుల గణనపై అసెంబ్లీలో తీర్మానం పెట్టడం కాదని, చట్టం చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. బిల్లు పెట్టి చట్టం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు తీర్మానంతో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. బీసీ కుల గణనపై చట్టం చేస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని స్పష్టంచేశారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (బీసీ కుల గణన) తీర్మానాన్ని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సుదీర్ఘ చర్చ జరిగింది.
అనంతరం ఈ తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తోపాటు బీజేపీ, ఎంఐఎం, సీపీఐ బీసీ కులగణనను స్వాగతిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ సందర్భంగా జరిగిన చర్చలో బీఆర్ఎస్ తరఫున గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బీసీ కుల గణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు స్పష్టంచేశారు. అయితే, లోక్సభ ఎన్నికల ముందు తీర్మానాన్ని ప్రవేశపెట్టి చేతులు దులుపుకొనే ధోరణి ప్రభుత్వంలో కనిపిస్తున్నదని విమర్శించారు. కుల గణనను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో కచ్చితంగా నిర్ణీత గడువు విధించాలని డిమాండ్ చేశారు.
కుల గణన కోసం బడ్జెట్ కూడా కేటాయించలేదని, ఖర్చును ఏవిధంగా సర్దుబాటు చేస్తారని ప్రశ్నించారు. కుల గణనపై అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. బీహార్, కర్ణాటక, ఏపీలో బీసీ కుల గణనను చేపట్టిన అక్కడి ప్రభుత్వాలు ఏండ్లు గడుస్తున్నా.. ఆ నివేదికలను బయటకు ఇవ్వలేదని, తెలంగాణలో కూడా ఆ విధంగా చేయొద్దని సూచించారు. అందుకే ప్రణాళికాబద్దంగా, చట్టం చేసి కుల గణన చేయాలని కోరారు. లేనిపక్షంలో ఇది ఒక తంతుగానే మిగిలిపోతుందని, దీనివల్ల బీసీలకు ఒరిగేదేమీ ఉండబోదని హెచ్చరించారు.
సమగ్ర కుల గణన చేపడితేనే బీసీల లెక్క ఎంతో తేలుతుందని సూచించారు. కేవలం బీసీ కుల గణన చేస్తే ప్రయోజనం ఉండబోదని పేర్కొన్నారు. ఎంబీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? బీసీలకు 42% రిజర్వేషన్లను ఎప్పుడు అమలు చేస్తారు? నియోజకవర్గానికి రూ.50 కోట్లతో నిర్మిస్తామన్న ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవన్లను ఎప్పుడు మొదలు పెడతారని ప్రశ్నించారు.
తీర్మానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. పలు సందేహాలు వ్యక్తంచేశారు. తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జనగణన, కుల గణన, సమగ్రసర్వే, బీసీ కుల గణన అంటూ నాలుగు మాటలు మాట్లాడారని ఇందులో ఏది చేస్తారని ప్రశ్నించారు. కుల గణన ప్రక్రియను బీసీ కమిషన్ ద్వారా చేస్తారా? జీఏడీ (ప్రభుత్వం) ద్వారా చేస్తారా? ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేసి చేస్తారా? అని ప్రశ్నించారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. మైనార్టీ కుల గణన కోసం ఏర్పాటుచేసిన రాజేంద్రకుమార్ సచార్ కమిషన్కు జ్యుడిషియల్ చట్టబద్ధత ఉన్నదని, రాష్ట్రంలో బీసీ కుల గణనకు ఎలాంటి చట్టబద్ధత లేదని తెలిపారు. తద్వారా భవిష్యత్లో న్యాయపరమైన చిక్కులు రావడం ఖాయమని ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే దీనికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.
కుల గణనపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. సలహాలు, సూచనలు ఇస్తారనుకుంటే అనుమానాలు రేకెత్తిస్తూ ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం రాజేందర్ సచార్ కమిటీ ద్వారా ముస్లింల సర్వే చేపట్టిన విధంగానే తాము కూడా సర్వే చేయనున్నట్టు తెలిపారు. అందరి వివరాలు సేకరిస్తేనే బీసీలకు రాజకీయ, విద్య, ఉపాధి పరంగా న్యాయం చేయగలుగుతామని పేర్కొన్నారు. బీసీ కుల గణన చేస్తుంటే అరశాతం జనాభా ఉన్నవాళ్లకు బాధగా ఉండొచ్చని అన్నారు.
బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం అని, కులగణన ద్వారా ఆయా వర్గాలకు సంఖ్యాబలం ఆధారంగా భాగస్వామ్యం అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. బీసీ సబ్ప్లాన్ కూడా తెస్తామని, భవిష్యత్లో మరిన్ని కార్యక్రమాలను అమలు చేసేందుకు కులగణన నాంది మాత్రమేనని పేర్కొన్నారు. బీసీ కులగణనపై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా సభ్యులు వెలిబుచ్చిన సందేహాలకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ సమాధానం ఇచ్చిన అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడారు. ఈ సందర్భంగా బీసీ కులగణన ద్వారా వచ్చే వివరాల ఆధారంగా భవిష్యత్లో అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. అందరికీ సమాన అవకాశాలు లభించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిపుణులు, మేధావుల సలహాలను కూడా స్వీకరించి ఎన్నికలకు ముందే విధివిధానాలు రూపొందించి కులగణను చేపడతామని స్పష్టంచేశారు. బీసీ కులగణనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తామని, అన్ని కులాలను సర్వే చేస్తామని చెప్పారు. ఇందులో అన్ని కుటుంబాల వివరాలూ వెల్లడవుతాయని తెలిపారు.
బీసీ కులగణనపై తమకు చిత్తశుద్ధి ఉన్నదని, అందరి సహకారంతో దీనిని విజయవంతం చేస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. దీనిపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, అందరి సూచనలు, సలహాలు తీసుకుంటామని చెప్పారు. మంత్రిమండలిలో సుదీర్ఘంగా చర్చించిన తరువాతే కులగణన చేయాలని నిర్ణయించినందున దీనికోసం చట్టం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బీసీలను సీఎంను చేస్తామని చెప్పిన బీజేపీ, తమ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న బీసీని తొలగించిందని విమర్శించారు. కనీసం అసెంబ్లీలో ఆ పార్టీపక్ష నేతగా కూడా బీసీకి అవకాశం ఇవ్వలేదని దుయ్యబట్టారు. చర్చ అనంతరం బీసీ కులగణన తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
రాజకీయ పార్టీలు ఓట్ల కోసమే బీసీ నినాదాన్ని వాడుకుంటున్నాయి తప్ప సీట్ల విషయం వచ్చేసరికి వారిని విస్మరిస్తున్నాయని బీజేపీ సభ్యుడు పాయల్శంకర్ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ కులగణన తీర్మానం ఎన్నికల నినాదం కాకూడదని పేర్కొన్నారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్ అమలు చేయడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. బీసీల కులగణనపై అఖిలపక్షంతో చర్చించాలని, కులగణనకు ఒక కమిషన్ను ఏర్పాటుచేయాలని సూచించారు.
ముస్లింలు.. ఎస్సీ, ఎస్టీ, బీసీల కన్నా వెనుకబడి ఉన్నారని, ఈ విషయం సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్ సైతం స్పష్టం చేశాయని మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. రిజర్వేషన్లపై 50% సీలింగ్ను ఎత్తివేసి జనాభా ఆధారంగా అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని, అందులో ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను అసెంబ్లీ ముందు ఉంచాలని కోరారు.
బీసీ కులగణన అంశాన్ని బిల్లు రూపంలో ప్రవేశపెడితే దానికి చట్టబద్ధత ఉంటుందని సీపీఐ పక్ష నాయకుడు కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. బీసీలు ఎంతో కష్టజీవులని, వారికి సంక్షేమ ఫలాలు అందాల్సిందేనని చెప్పారు. కులగణన తీర్మానాన్ని తాము ఆమోదిస్తున్నట్టు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు మైనారిటీలకు, క్రిష్టియన్ మతం స్వీకరించిన దళితవర్గాలకు కూడా రిజర్వేషన్లు వర్తింపజేయాలని కోరారు. ఓసీల్లోని పేదలకు కూడా విద్యలో సహకారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల్లో బీసీల ఓట్లను దండుకోవడానికే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో జనగణనపై తీర్మానం చేసిందని జాతీయ జనగణన వేదిక చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రంలో జనగణను ఏ పద్ధతిలో చేస్తుందో చెప్పనేలేదని, బడ్జెట్ కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. అలాంటప్పుడు జనగణన ఎలా చేస్తుందని ప్రశ్నించారు. దేశాన్ని, రాష్ర్టాన్ని దాదాపు 50 ఏండ్లు పరిపాలన చేసి బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ మరోసారి ఓబీసీలను మోసం చేసే ఎత్తుగడగా ఈ తీర్మానం చేసిందని పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ సర్కారు, ఓబీసీ ప్రధాన మంత్రినని చెప్పుకుంటున్న మోదీ సైతం ఓబీసీలను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు బీసీలు బుద్ధి చెప్పాలని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.
బీసీ వర్గాల అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ కులగణన తీర్మానాన్ని తాము స్వాగతిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కే తారకరామారావు స్పష్టంచేశారు. బీహార్లో జీఏడీ ద్వారా కులగణన చేపట్టేందుకు ప్రయత్నించగా ఇబ్బందులు తలెత్తాయని, అందుకే రాష్ట్రంలో కులగణనకు బిల్లు పెట్టాలని సూచించారు. దీనివల్ల చట్టబద్ధత వస్తుందని, లేనిపక్షంలో జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేయాలని కోరారు. బీసీల హక్కుల కోసం తమ పార్టీ ఎప్పటినుంచో కృషిచేస్తున్నదని వివరించారు. 2004లో యూపీఏ-1 హయాంలో బీసీల హక్కులపై బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్యతో కలిసి అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ను కలిసి దాదాపు చర్చించినట్టు చెప్పారు. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలని తాము ఎంతోకాలంగా కోరుతున్నామని, తెలంగాణ ఏర్పాటు అనంతరం రెండుసార్లు దీనికి అనుకూలంగా అసెంబ్లీ తీర్మానాలుచేసి కేంద్రానికి పంపించినట్టు గుర్తుచేశారు. కేంద్ర బడ్జెట్లో కనీసం 5% నిధులు బీసీలకు కేటాయిస్తే రూ. రెండు లక్షల కోట్లు లభిస్తాయని తెలిపారు. రాజేంద్రకుమార్ సచార్ కమిటీ ఏర్పాటులో సైతం కేసీఆర్ పాత్ర ఉన్నదని పేర్కొన్నారు.