భూపాలపల్లి టౌన్, డిసెంబర్ 29: కేంద్రం బొగ్గు బ్లాకుల వేలం ఆపకపోతే నల్ల చట్టాలపై రైతులు చేసిన పోరాటాన్ని గుర్తుచేయాల్సి వస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. గురువారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఎమ్మెల్యే గండ్ర ఆధ్వర్యంలో సింగరేణి పోరు దీక్ష జరిగింది.
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బీ వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య తదితరులు ఎమ్మెల్యేతో కలిసి దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. ప్రధాని మోదీ కార్మిక, ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకువస్తున్నారని మండిపడ్డారు. బొగ్గు వేలం ఆపకపోతే కార్మికుల ఆగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు.