జయశంకర్ భూపాలపల్లి : పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. గురువారం భూపాలపల్లి మండలం కొంపెల్లి, గోర్లవేడు, నేరెడుపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో లబ్ధిదారుల ఇండ్ల వద్దకు నేరుగా వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు వరంగా మారాయన్నారు. సీఎంఆర్ఎఫ్ నిరుపేద రోగుల పాలిట సంజీవనిగా మారిందన్నారు. పేదలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.