మంచిర్యాల, ఏప్రిల్ 13 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్, ఆయన కుటుంబం అసలు దళితులే కారని పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అన్నారు. ఈ విషయాన్ని నిరూపించేందుకు తాను సిద్ధమంటూ సవాల్ విసిరారు. శనివారం ఆయన మంచిర్యాలలో మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీ దళితుడు ఎలా అవుతాడో వివేక్ చెప్పాలని ప్రశ్నించారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలుగా ఈ విషయంలో మాట్లాడేందుకు తమకు వందశాతం హక్కు ఉన్నదని అన్నారు. వివేక్ భార్య బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారని, ఆమె కుమారుడు వంశీ దళితుడు కాదని ఆయన పేర్కొన్నారు. తనపై ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా వివేక్, వంశీ నకిలీ దళితులు అని నిరూపించి తీరుతానని ఆయన స్పష్టం చేశారు.
పెద్దపల్లి పార్లమెంట్లో వివేక్ కుటుంబం కారణంగా మూడు కులాలకు అన్యాయం జరుగుతుందని విమర్శించారు. బెల్లంపల్లి, చెన్నూర్ ఎమ్మెల్యే టికెట్ అన్నదమ్ములు తీసుకొని, పెద్దపల్లి ఎంపీ టికెట్ కొడుక్కి ఇప్పించుకోవడంతో స్థానికంగా ఉండే మాదిగలు, నేతకాని, మాల సోదరులకు రాజకీయంగా అన్యాయం జరిగిందని అన్నారు. ఈ మూడు కులాల వారిని కలుపుకొని సామాజిక రాజకీయ ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు.
వెంకటస్వామి ఉన్నప్పటి నుంచి మాదిగలకు అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ, బీ, సీ, డీ వర్గీకరణకు 30 ఏండ్లుగా అడ్డుపడుతున్నది వెంటకస్వామి కుటుంబమేనని ఆరోపించారు. కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమని పేర్కొన్నారు. ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజా కోర్టులో శిక్ష తప్పదని శ్రీనివాస్ హెచ్చరించారు.