వరంగల్ : పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని ఎస్.ఎస్.గార్డెన్స్ లో వివిధ గ్రామాలకు చెందిన 432 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గృహలక్ష్మి పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.3 లక్షల సాయం అందించనున్నామని తెలిపారు.
దరఖాస్తుల ఆధారంగా ప్రత్యేక బృందాలు సర్వే చేసి జాబితాను పారదర్శకంగా రూపొందించామన్నారు. మొదటి విడతలో లబ్ధి పొందని వారు నిరాశపడొద్దని, గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదవారి కల నెరవేర్చడమే లక్ష్యంగా చేసుకొని గృహలక్ష్మి పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి గృహలక్ష్మి పథకం వర్తింప చేస్తామని తెలిపారు.
ఈ పథకంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాలు ఎవరు నమ్మవద్దని సూచించారు. గత ప్రభుత్వాల హయాంలో వారి అనుచరులకు పథకాలు అందజేశారు కానీ, ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. నేడు సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ ఫలాలు పార్టీలకు అతీతంగా, పారదర్శకంగా ప్రజలకు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని చెప్పారు.