వరంగల్ : పరకాలా బీఆర్ఎస్ అభ్యర్థి ధర్మారెడ్డి (MLA Dharma Reddy ) ప్రచారంలో జోరు పెంచారు. గెలుపే లక్ష్యంగా జోరు వానలోనూ ఇంటింటికి తిరుగతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. గురువారం బొల్లికుంట(Bollikunta)లో వర్షంలో సైతం లెక్క చేయకుండా ఎంపీ పసునూరి దయాకర్తో కలిసి బొల్లికుంటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డిమాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఎలాంటి ప్రణాళిక లేదన్నారు. ఢిల్లీ నుంచి, కర్ణాటక నుంచి వచ్చే పొలిటికల్ టూరిస్టులతో కలిగే ప్రయోజనం శూన్యమని స్పష్టం చేశారు. సమర్ధవంతమైన పాలనను అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బలపర్చాలని పేర్కొన్నారు. సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ ఓట్లను అడుగుతున్నదని, వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. మరోసారి దీవించండి మరింత అభివృద్ధి చేసి.. మీ పిల్లల భవిష్యత్ కి బాటలు వేస్తానని తెలిపారు.
ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ.. మంచి మనసున్న వ్యక్తి, అనునిత్యం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పరితపించే ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే జూట మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. ప్రజల సంక్షేమమే పరమావధిగ పనిచేస్తున్న కేసీఆర్ కి మనమంతా మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.