నల్లగొండ : నాపైన ఐటీ సోదాలు((IT Raids)) జరుగుతున్నాయన్న ప్రచారాన్ని నమ్మవద్దని మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే భాస్కర్ రావు(MLA Bhaskar Rao) అన్నారు. గురువారం మిర్యాలగూడ మండలం అన్నపురెడ్డిగూడెం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడో వ్యాపారస్తుల మీద రైడ్ జరిగితే నాకేం సంబంధం అని ప్రశ్నించారు.
నా బంధువుల పైన గాని, నా కుమారుల ఇంట్లో గానీ ఐటీ సోదాలు జరగట్లేదన్నారు. నాపైన ఐటీ సోదాలు జరిగితే నేనెందుకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని ప్రశ్నించారు. నాకు పవర్ ప్లాంట్లు ఉన్నాయి అన్నది అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. కాగా, జిల్లాలో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టిస్తున్నాయి.
నల్లగొండ, మిర్యాలగూడ, హైదరాబాద్లో 40 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడలోని వైదేహీ వెంచర్స్తోపాటు రైస్మిల్ యజమానులు రంగా శ్రీధర్, రంగా రంజిత్, బండారు కుశలయ్య ఇండ్లలో సోదాలు చేస్తున్నారు. గురువారం ఉదయం 4 గంటల నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఒక్క నల్లగొండలోనే 30 బృందాలు తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.