గద్వాల, సెప్టెంబర్ 12 : తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇవ్వగా ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తీర్పుపై సోమవారం కోర్టు స్టే ఇచ్చింది. మంగళవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యేను గజమాలతో సన్మానించారు.
అనంతరం ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ మాజీ మంత్రి డీకే అరుణ ప్రజాస్వామ్య యుద్ధంలో పోరాడలేక కోర్టుల చుట్టూ తిరుగుతూ ప్రజల ముందు అభాసుపాలైందని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ఆమె ప్రజలను పట్టించుకోలేదని, ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇప్పుడు ప్రజలపై ప్రేమను నటిస్తున్నట్టు ఆరోపించారు. ర్యాలీగా ఇంటికి చేరుకున్న బండ్లకు కుటుంబ సభ్యులు హారతులు పట్టారు.