చెన్నూర్: చెన్నూరు పట్టణంలో అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఫేజ్ – 1 లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనుల తీరు తెన్నులు, ఫేజ్ -2 లో భాగంగా చేయాల్సిన అభివృద్ధి పనులపై మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, అధికారులతో చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఫేజ్ – 1 లో భాగంగా రూ. 140 కోట్లతో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు. ముఖ్యంగా రూ. 25 కోట్లతో జలాల్ పెట్రోల్ బంక్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు, పెద్ద చెరువు నుంచి బుద్ధారం రోడ్డు వరకు నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయన్నారు.
మిషన్ భగీరథ పథకం ద్వారా చెన్నూర్ పట్టణంలో రూ. 17.52 కోట్లతో 99.49 కిలోమీటర్ల పైపులైన్ వేసి 7,629 గృహాలకు తాగునీరు అందిస్తున్నట్లు బాల్క సుమన్ తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో పట్టణం నడిబొడ్డున రూ. ఏడు కోట్లతో ప్రభుత్వ దవాఖాన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. వచ్చే 40 ఏళ్ల జనాభా అంచనా దృష్ట్యా ముందు చూపుతో రూ. 7.20 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మిస్తున్నామని స్పష్డం చేశారు. పెద్ద చెరువు, ఆస్నాద్ చెరువు ట్యాంక్ బండ్లను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెన్నూరు పట్టణంలో రూ. 21.02 కోట్లతో 400 ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని, వాటి పనులు మరింత వేగం పెంచాలని పేర్కొన్నారు.
రూ.90 లక్షలతో 18 వార్డుల్లో 18 బతుకమ్మ గ్రౌండ్స్ , రూ. 2.50 కోట్లతో కేసీఆర్ పార్కు, కోటి రూపాయలతో వైకుంఠధామం, కోటి రూపాయలతో 33/11కేవీ సబ్ స్టేషన్, 40 లక్షలతో రెండు ఓపెన్ జిమ్స్, రూ. 1.50 కోట్లతో డంపింగ్ యార్డ్, రూ. 1.50 కోట్లతో సమ్మక్క-సారలమ్మ మహిళా భవన్, రూ. 80 లక్షలతో నాలుగు కేసీఆర్ మల్టీపర్పస్ కమ్యూనిటీ భవనాలు, కోటి రూపాయలతో స్వచ్ఛ ఆటోలు, కోటి రూపాయలతో కాలువలు, ఒక కోటి తో బృహత్ పట్టణ ప్రకృతి వనం, ఐదు చిల్డ్రన్స్ ప్లే ఏరియా, రూ.2.58 కోట్లతో జంతువధ శాల ఏర్పాటు పనులపై కూలంకషంగా అధికారులతో చర్చించారు.
ఫేజ్ – 1 లో నిర్దేశించుకున్న పనులు కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఫేజ్ -2లో చేయాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా పట్టణ మౌలిక వసతుల కల్పనలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులకు వార్డుకు రూ.60 లక్షల చొప్పున నిధులు కేటాయించి, అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని చెప్పారు. అంతేకాకుండా పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ నుంచి హైవే రోడ్డు వరకు రోడ్డు, బైరి సత్తన్న జంక్షన్ నుంచి హైవే రోడ్డు వరకు రోడ్డు, సీతారామ తోట రోడ్డు నుంచి లైన్ గడ్డ స్కూల్ వరకు సీసీ రోడ్లు వేసేందుకు ప్రణాళికలు రచించాలని అధికారులను ఆదేశించారు. బొక్కలకుంట, కుమ్మరి కుంట వద్ద 20 లక్షల రూపాయలతో రెండు కేసీఆర్ కమ్యూనిటీ భవనాలను నిర్మిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ దేశ్ పాండే, ఏఈ సాయి, సీఐ, ఎస్ఐ, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.