కమలాపూర్: ఈటల రాజేందర్ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పిలుపునిచ్చారు. సానుభూతి పొందేలా ఈటల డ్రామాలు చేసే అవకాశం ఉందని చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్లో జరిగిన వికలాంగుల ఆత్మీయ సమ్మేళనంలో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. గత పాలకులు దివ్యాంగుల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ పాలనలో దివ్యాంగులందరికి పెన్షన్ అందుతున్నదని చెప్పారు.
దివ్యాంగులకు డబుల్ బెడ్రూం ఇండ్లను ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో రూ.3016 పెన్షన్ అందుతున్నదా అని ప్రశ్నించారు. దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, బ్యాటరీ వాహనాలను అందిస్తున్నామని చెప్పారు. గెల్ల శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు.
వికలాంగుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని వాసుదేవరెడ్డి అన్నారు. వికలాంగులకు రూ.3016 పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.