హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి దద్దమ్మలా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ఎల్పీలో ఎంపీ దయాకర్, ఎమ్మెల్యే జాజుల సురేందర్తో కలిసి బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తేలేని కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ను విమర్శించడం సరికాదన్నారు. తెలంగాణకు కేంద్రం మోసం చేస్తుంటే పెదవులు మూసుకుని కూర్చుంది కిషన్ రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. విభజన చట్టం హామీలు కేంద్రం అమలు చేయకున్నా పెదవులు మూసుకుని కూర్చున్న దద్దమ్మ కిషన్ రెడ్డి అని ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం రాష్ట్ర అసెంబ్లీ కేంద్రానికి తీర్మానాలు చేసి పంపిస్తే వాటిపై కేంద్రం స్పందించడం లేదు.. ఈ విషయంలో కిషన్ రెడ్డి ఎందుకు నోరు మూసుకున్నారని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి.. తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకివ్వరు.. దీనిపై కిషన్ రెడ్డి పెదవి విప్పరు. అన్నిట్లో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తుంటే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారో సమాధానం చెప్పాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.
అసలు నరేంద్ర మోదీని మించిన మోసగాడు ఎవరైనా ఉన్నారా? అని బాల్క సుమన్ ప్రశ్నించారు. నల్ల చట్టాలతో రైతుల ఉసురు పోసుకుంది మోదీ కాదా? దేశంలో నిరుద్యోగాన్ని చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పెంచింది మోదీ కాదా? రూపాయి విలువ దేశ చరిత్రలోనే కిందకు దిగజార్చిన మోదీ మోసగాడు కాదా? దేశ ఆస్తులను తాకట్టు పెడుతున్న మోదీ మోసగాళ్లకే మోసగాడు కాదా? మోదీది.. బీజేపీది మోసపు చరిత్ర కాదా? అని బాల్క సుమన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అన్యాయం చేస్తున్న మోసగాడు మోదీ అని ధ్వజమెత్తారు.