Palamuru Rangareddy Lift Irrigation | మహబూబ్నగర్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు’లో సర్వం కోల్పోయినా తెలంగాణ సర్కారు తీసుకొన్న చర్యలతో వారంతా కోటీశ్వరులయ్యారు. వారికి అడిగినంత పరిహారాన్ని ప్రభుత్వం ఇవ్వడంతో మరోచోట భూములు కొన్నారు. సీఎం కేసీఆర్ విజన్తో ఆ ప్రాంతమంతా అభివృద్ధి చెందగా.. వారు కొన్న భూముల ధరలకు రెక్కలు రావడంతో నిర్వాసితులంతా కోటీశ్వరులయ్యారు. పట్టణాల్లో వారికి అన్ని సౌకర్యాలతో తెలంగాణ సర్కారు కాలనీలు నిర్మించి ఇవ్వగా.. అన్నీ కోల్పోయినా.. తమకు ఆత్మగౌరవంతో జీవించే అవకాశం దక్కిందని నిర్వాసితులు ఆనందపడుతున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలంలో కరివెన రిజర్వాయర్ నిర్మించారు. ఇందులో భట్టుపల్లితండా ముంపునకు గురైంది. తండావాసుల కోరిక మేరకు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి 2013 జీవో ప్రకారం వారికి ఎకరాకు రూ.5.50 లక్షల పరిహారంతోపాటు ఇండ్లు కోల్పోయిన 84 మంది బాధితులకు అన్ని కలిపి రూ.15 కోట్ల వరకు పరిహారం రూపంలో అందేలా చూశారు. తండావాసులంతా కరివెన రిజర్వాయర్కు సమీపంలోనే నాగర్కర్నూల్- మహబూబ్నగర్ రహదారి పక్కన రూ.50 లక్షలు పెట్టి నాలుగున్నర ఎకరాలు భూమిని కొన్నారు. 200 గజాల చొప్పున 90 ప్లాటు చేసుకొని వచ్చిన పరిహారంతో ఇండ్లు కట్టుకొన్నారు. వచ్చిన పైసలతో భూములు కొనుగోలు చేశారు. భవనాలు నిర్మించుకొన్నారు. కృతజ్ఞతగా తండాకు ఆల వెంకటేశ్వర్రెడ్డి కాలనీగా నామకరణం చేసుకున్నారు. ఆ తండా ప్రత్యేక పంచాయతీగా మారింది.
కరివెన రిజర్వాయర్లో నాకున్న మూడెకరాలు పోయింది. ప్రభుత్వం ఇచ్చిన పరిహారంతో వేరేచోట రూ.5 లక్షలకు రెండెకరాలు కొన్నా. ఇల్లు కట్టుకున్నా.. ఆ రెండెకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్న. రైతుబంధుతో పెట్టుబడికి కష్టాలు లేవు. నాడు 5 లక్షలకు కొన్న భూమి నేడు కోటి ధర పలుకుతున్నది. ఇదంతా కేసీఆర్ పుణ్యమే.
– చందునాయక్, భట్టుపల్లితండా (మహబూబ్నగర్)
పుట్టిపెరిగిన ఊరిని చూసి.. మా ఇంటోళ్ల పరిస్థితిని చూసి సదువు, సంధ్య లేకుండా బొంబాయి వలసపోయిన. నాలుగేండ్ల కిందట ఇల్లు, భూమి పోతుందని తెలిసి వాపస్ వచ్చిన. ఊరోళ్లంతా కలిసి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పగానే సరే అని వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకుని మేస్త్రీ పని చేసుకుంటున్న. పదిమందికి పని ఇస్తున్న.
-పత్లావత్ బాలునాయక్,
భట్టుపల్లితండా (మహబూబ్నగర్)