కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): అది ఆదివాసీలు నివాసం ఉండే రాష్ట్రంలోనే అత్యంత మారుమూల ప్రాంతం. అక్కడ కొండల్లో ఉన్నది ఒకే కుటుంబం.జనాభా ఆరుగురే. అలాగని, ప్రభుత్వం వారిని గాలికి వదిలేయలేదు. కరెంట్ సౌకర్యం కల్పిం చింది. కేవలం వారి కోసమే రూ.12 లక్షల వెచ్చించి మిషన్ భగీరథ ట్యాంకు నిర్మించింది. రెండు నల్లాలు ఏర్పాటుచేసి దాహార్తిని తీరుస్తున్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలోని బబ్లుతండాలో నాలుగేండ్ల కిందటి వరకు ఐదు కుటుంబాలు నివాసం ఉండేవి. వివిధ కారణాలతో నాలుగు కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాయి. ఆత్రం భీం, అతని భార్య, కొడుకు, కోడలు వారి పిల్లలు మాత్రమే ప్రస్తుతం ఉంటున్నారు. ఈ కుటుంబం కోసమే ప్రభుత్వం మిషన్భగీరథ ట్యాంకు నిర్మించి స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నది. కొండలు, గుట్టల మీదుగా పైపలైన్లు వేసి తాగునీరు అందిస్తుండటం ప్రభుత్వ పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తున్నది.