హైదరాబాద్ : వరద ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరాఫరాపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎంవో కార్యదర్శి, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్ ( Smita Sabharwal ) ఆదేశించారు. డబుల్ క్లోరినేషన్తో పాటు నీటి నాణ్యత పరీక్షల శాంపిల్స్ సంఖ్యను పెంచాలని ఆమె సూచించారు.
బుధవారం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరాఫరా స్థితిపై చీఫ్ ఇంజనీర్లు, అన్ని జిల్లాల ఎస్ఈ, ఈఈ, డీఈఈ లతో ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు, వాతావరణ మార్పులతో తాగునీరు కలుషితం అయ్యే అవకాశం ఉన్నందున స్వచ్ఛతపై అత్యంత జాగ్రత్తగా ఉండాలని భగీరథ ఇంజనీర్లుకు స్మితా సభర్వాల్ సూచించారు. నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం నీటి శుద్ది కేంద్రాల్లోని పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఇక గ్రామాల్లో ఉన్న ఓహెచ్ఆర్ఎస్ దగ్గర నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. దీంతో పాటు ఇండ్లలో ఉన్న నల్లా కనెక్షన్ ల దగ్గర కూడా నీళ్లు నిల్వ లేకుండా, పరిశుభ్రంగా ఉంచుకునేలా గ్రామస్థులకు అవగాహన కల్పించాలని, చైతన్యం తీసుకురావాలన్నారు. ఇండ్లలో తాగునీటి సేకరణ, నిల్వకు ఉపయోగించే ప్లాస్టిక్ పైపులు, డ్రమ్ములను కూడా క్లీన్ గా ఉంచుకునేలా గ్రామస్థులకు చైతన్యం కల్పించాలన్నారు.