హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): మిషన్ భగీరథ పథకం మరో చరిత్ర సృష్టించింది. ఈ ప్రాజెక్టును అంచనా వ్యయం కంటే 18% తక్కువ వ్యయంతో పూర్తి చేశారు. దీనిని రూ.44,933.66 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించారు. కానీ ప్రాజెక్టు పూర్తి అయ్యే నాటికి వాస్తవ వ్యయం రూ.36,900 కోట్లు మాత్రమే. మిషన్ భగీరథను అతి తక్కువ వ్యయంతో, అతి తక్కువ సమయంలో పూర్తి చేశామని మంత్రి హరీశ్రావు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.
ఖచ్చితమైన ప్రణాళిక, అత్యంత పారదర్శకత, ఆధునిక పద్ధతులు, విధానాలను అవలబించి నిర్ణీత సమయంలో పూర్తి చేయడమే కాకుండా రూ.8,033.66 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసినట్టు వివరించారు. మిషన్ భగీరథతో రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడ పూర్తిగా అంతమైంది. ఈ పథకాన్ని కాపీ కొట్టిన కేంద్రం జాతీయ స్థాయిలో హర్ ఘర్ జల్ యోజన పేరుతో అమలు చేస్తున్నది. మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్ల సాయం చేయాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కేంద్రం నయా పైసా ఇవ్వలేదు.