Telangana | హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం అలమటించాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రిజర్వాయర్లతోపాటు మిషన్భగీరథ రిజర్వాయర్లు సైతం వేసవి ప్రారంభంలోనే డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. మరోవైపు, భూగర్భజలాలు సైతం పడిపోతున్నాయి. వెరసి రాబోయే రెండు నెలలు సాగునీటికే కాదు.. తాగునీటికీ తిప్పలు తప్పని దుస్థితి నెలకొన్నది.
ఎస్సారెస్పీలో పడిపోతున్న నిల్వలు
ఎస్సారెస్పీ ప్రాజెక్టులో నీటి నిల్వలు గత నెల 21 నాటికి 34 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 17.88 టీఎంసీలకు పడిపోయాయి. ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ 332 మీటర్లు కాగా, డెడ్ స్టోరేజీ 320 మీటర్లు. ప్రస్తుతం ప్రాజెక్టు లెవల్ 324 మీటర్లుగా ఉన్నది. ఏప్రిల్ మొదటి వారం వరకు సాగునీటిని విడుదల చేయాల్సి ఉన్నందున అప్పటికి ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకోనున్నది. ఈ ప్రాజెక్టు నుంచి వేసవి తాగునీటి అవసరాలకు ప్రతి నెలా అర టీఎంసీ చొప్పున రాబోయే రెండు నెలలకు ఒక టీఎంసీ నీళ్లు అవసరం.
ఎల్ఎండీ నెల క్రితమే డెడ్స్టోరేజీ
కరీంనగర్ నగరానికి ప్రధాన తాగునీటి వనరైన ఎల్ఎండీలోనూ పరిస్థితి దారుణంగా మారింది. నెల క్రితమే డెడ్ స్టోరేజీకి చేరుకున్నది. 24.034 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఎల్ఎండీ నిరుడు మార్చిలో 12.50 టీఎంసీ లు ఉండగా, ప్రస్తుతం 5.31 టీఎంసీలే ఉన్నా యి. ఈ రిజర్వాయర్కు మిడ్మానేరు నుంచి 1,467 క్యూసెకుల నీరు వస్తుండగా, ఇకడి నుంచి కాకతీయ కెనాల్ ద్వారా 3,125 క్యూసెకులను సాగు నీటి అవసరాల కోసం దిగువకు విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ మొద టి వారం వరకు సాగునీటి విడుదల కొనసాగనున్నది. మొత్తంగా ఎల్ఎండీలో మరో రెండు టీఎంసీల మేర నిల్వలు తగ్గిపోనున్నాయి.
డెడ్స్టోరేజీకి మిషన్భగీరథ జలాశయాలు
వివిధ ప్రాజెక్టుల్లో భాగమైన పలు రిజర్వాయర్లను మిషన్భగీరథ పథకానికి గత ప్రభు త్వం అనుసంధానించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన రిజర్వాయర్లన్నీ ఇప్పటికే డెడ్స్టోరేజీకి చేరుకున్నాయి. పాలేరు రిజర్వాయర్ ద్వారా ఖమ్మం సహా ఐదు జిల్లాల్లోని 2,450 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందించాల్సి ఉన్నది. పాలేరు పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం 9 అడుగులు ఉన్నది. ఐదు అడుగుల అట్టడుగుస్థాయి వరకు నీటిని తీసుకొని వినియోగించాలని అధికారులు నిర్ణయించినా మరో వారం పది రోజులకు మించి సరిపోవు. దీంతో పాలే రు నుంచి నీరు ఇవ్వలేమని, ఎకడికకడ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఎల్లూర్ రిజర్వాయర్, అదేవిధంగా మిషన్భగీరథలో భాగమైన కోయిల్సాగర్, రామన్పాడు, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, వైరా, పెండ్లిపాకల, ఉదయసముద్రం, గోపాలదిన్నె, శంకరసముద్రం, కుమ్రంభీం, మేడారం, భీమ్ఘన్పూర్, ధర్మసాగర్, చలివాగు తదితర ప్రాజెక్టుల్లో కొన్ని డెడ్ స్టోరేజీకి చేరుకోగా, మరో 15 రోజుల్లో మిగిలినవి కూడా చేరుకోనున్నాయి.
నాగార్జునసాగర్ దయనీయం
నాగార్జునసాగర్ ఎఫ్ఆర్ఎల్ 590 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టు లెవల్ 513 అడుగులు ఉండగా 137 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా, ఈ ఏడాది 505 అడుగులుగా నిర్ణయించారు. ఈ లెక్కన ఇప్పుడు వినియోగానికి మిగిలేవి సుమారు 14 టీఎంసీలు. మార్చి నెలకు సంబంధించి సాగర్ నుంచి ఏపీకి ఐదు టీఎంసీలను విడుదల చేయాల్సి ఉన్నది. అవి మినహాయిస్తే తొమ్మిది టీఎంసీలే ఉంటాయి. అయినా శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల నుంచి నీటిని వినియోగించుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు.
కృష్ణా ప్రాజెక్టులు వెలవెల
ఈ ఏడాది ఆశించిన రీతిలో వర్షపాతం నమోదైనప్పటికీ ఎగువ ప్రాంతాల్లో సరైన వర్షాలు కురవలేదు. దీంతో కృష్ణా బేసిన్లో జూరాల, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు అంతగా వరదలు రాలేదు. ఈ మూడు ప్రాజెక్టులపై ఆధారపడిన లిఫ్టులు కూడా పనిచేయలేని పరిస్థితి నెలకొనడంతో వాటి అనుబంధ రిజర్వాయర్లన్నీ నీళ్లు లేక బోసిపోతున్నాయి. పెద్ద ప్రాజెక్టులే కాకుండా మధ్యతరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లోనూ ఇదే దుస్థితి నెలకొనడంతో కృష్ణా బేసిన్లో భూగర్భజలాలు పాతాళానికి పడిపోతున్నాయి.
అడుగంటుతున్న గోదావరి బేసిన్
గోదావరి బేసిన్లో ఈ ఏడాది సమృద్ధిగానే వర్షాలు కురవడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 199, సింగూరుకు 21, నిజాంసాగర్కు 41, మిడ్మానేరుకు 42, ఎల్ఎండీకి 67.79, కడెం ప్రాజెక్టుకు 60.37 టీఎంసీల వరద జలాలు వచ్చాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మొత్తంగా 395.78 టీఎంసీల జలాలు చేరి నప్పటికీ గోదావరి బేసిన్లోనూ నీటిఎద్దడి నెలకొన్నది. ఇక, మీడియం, మైనర్ ప్రాజెక్టు లైన రామప్ప, లక్నవరం, పాకాల, మత్తడివాగు, నీల్వాయి, కిన్నెరసాని, పాలేరు, పాలెం, కోటిపల్లి, వైరా, లంకాసాగర్, మూసీ, శనిగరం, రామడుగు, మల్లూరు, గుండ్లవాగు, బయ్యారం, స్వర్ణ తదితర ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు వేసవికి ముందే అడుగంటాయి.
లోలోతుకు భూగర్భజలాలు
ప్రాజెక్టులు అడుగంటి పోవడం, కాలువ ద్వారా ఆశించిన మేర నీటిసరఫరా లేకపోవడంతో ఈ ఏడాది వేసవికి ముందే రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజల మట్టాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. నిరుడు ఇదే సమయానికి 7.34 మీటర్లు ఉన్న సగటు భూగర్భజల మట్టం ఇప్పటికే 8.70 మీటర్లకు దిగజారినట్టు ప్రభుత్వ నివేదిక స్పష్టం చేస్తున్నది. ఏప్రిల్ నెలాఖరుకు ఈ మట్టాలు మరింత పడిపోవడం ఖాయమని, దీంతో ఈసారి తాగునీటికి సైతం తండ్లాట తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆలేరు ఎమ్మెల్యే గ్రామంలో నీరు లేక ఎండిన పొలాలు
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురంలో రైతు చాగంటి సిద్దులు తన మూడెకరాల వరి పొలం నీళ్లు లేక ఎండిపోవటంతో పశువులను మేపుతున్న దృశ్యం. ఇంకో రైతు బండారి స్వామిది కూడా ఇదే పరిస్థితి. రెండు బోర్లు వేసినా పొలం పారకపోవటంతో నాలుగు ఎకరాల వరి పంట ఎండిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యం. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సొంతం గ్రామం సైదాపురంలో రైతులకు ఈ దుస్థితి రావటం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లా ఉందో దీన్నిబట్టి తెలుస్తున్నది. గుజ్జ నరేష్ , స్టాఫ్ ఫోటోగ్రాఫర్, నమస్తే తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా.