హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రజలకు తాగునీటిని సరఫరా చేయడంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పంచాయతీ, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మిషన్ భగీరథ ఉన్నతాధికారులు సూచించారు. గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీటి సరఫరా నిర్వహణపై గ్రామీణ నీటిసరఫరా, మిషన్ భగీరథ అధికారులు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు మార్గదర్శకాలను జారీ చేశారు.
ఈ నేపథ్యంలో ఆదివారం మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. గ్రామం వరకు మిషన్ భగీరథ అధికారులు, గ్రామంలో అంతర్గతంగా ప్రతి ఇంటికీ నల్లా నీటిని అందించే బాధ్యతను గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం అప్పగించింది. మార్గదర్శకాలను గ్రామ పంచాయతీల స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు అమలు చేయాల్సి ఉంటుంది. వారికి అవసరమైన సహయం, సలహాలు, సూచనలు చేయాల్సిందిగా మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.