గజ్వేల్/మర్కూక్, ఆగస్టు 29: మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ శుద్ధి చేసిన నీటిని అందించడం ఎంతో బాగున్నదని యునిసెఫ్ బృందం సభ్యులు ప్రశంసించారు. ఆ బృందం సభ్యులు రాధిక శ్రీవాస్తవ, వెంకటేశ్ ఆలపర్తి, రాఘవ్ ఆరోరా మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండ లం కోమటిబండ మిషన్ భగీరథ ప్లాంట్ను సందర్శించారు. ఈ పథకం పనితీరును ఎస్ఈ శ్రీనివాసాచారి, ఈఈ రాజయ్య ప్లాంట్ ఉద్దేశం, రూపకల్పన, పనితీరు విధానం, నీటి సరఫరా, నీటి స్వచ్ఛత తీరు తదితర అంశాలను వారికి వివరించారు.
ఇంటింటికీ శుద్ధిచేసిన నీటిని అందిస్తున్న తీరు, ప్రజలకు శుద్ధ్దిచేసిన నీటిని అందించడంతో కలుగుతున్న ప్రయోజనాలను తెలియజేశారు. తెలంగాణలో ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా నాణ్యమైన శుద్ధినీటిని ప్రభుత్వం ఉచితంగా అందివ్వడంపై యునిసెఫ్ బృందం సభ్యులు ప్రశంసించారు. మర్కూక్లోని ఉన్నత ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, టాయిలెట్లు, మిషన్ భగీరథ జలాలను పరిశీలించారు. ఎర్రవల్లి ప్రాథమికోన్నత పాఠశాలను పరిశీలించి మౌలిక వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు.