గజ్వేల్అర్బన్/తొగుట, ఆగస్టు 24: సుదూరంలోని కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి, శుభ్రపరిచి స్వచ్ఛమైన తాగునీటిని రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ సరఫరా చేయడం గొప్ప విషయమని నాగాలాండ్ గ్రూప్-1 అధికారులు కితాబిచ్చారు. ఇందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవను కొనియాడారు. నాగాలాండ్కు చెందిన 20 మంది గ్రూప్-1 అధికారులు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల పరిశోధన కేంద్రంలో కొనసాగుతున్న శిక్షణలో భాగంగా గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. గజ్వేల్లోని ప్రభుత్వ జిల్లా దవాఖాన, మండల పరిధిలోని కోమటిబండ మిషన్భగీరథ సంప్హౌస్, మల్లన్న సాగర్ను సందర్శించారు.
మిషన్ భగీరథ ఈఈ రాజయ్య మిషన్ భగీరథ ప్రాజెక్టు ఉద్దేశం, రూపకల్పనతోపాటు కాళేశ్వర జలాల సేకరణ, నీటి శుద్ధీకరణ చేసే విధానం, ఇంటింటికీ నీటి సరఫరా చేసే విధానాన్ని నాగాలాండ్ అధికారులకు వివరించారు. మిషన్ భగీరథ ద్వారా పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు కూడా తాగునీటిని సరఫరా చేస్తుండగా వారి నుంచి సేకరించే బిల్లులు పథకం నిర్వహణకు సరిపోతున్నట్టు తెలిపారు. మిషన్ భగీరథ వచ్చిన నాటి నుంచి ఫ్ల్లోరైడ్, అతిసార తదితర వ్యాధులు లేకుండా పోయాయని, ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటున్నారని చెప్పడంతో నాగాలాండ్ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత గొప్పగా తాగునీటి వ్యవస్థను రూపొందించిన కేసీఆర్ నిజంగా గట్స్ ఉన్న ముఖ్యమంత్రి అని కితాబునిచ్చారు.