సూర్యాపేట: మంత్రి జగదీశ్రెడ్డి మరోసారి ఔదార్యం చాటారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇటీవల ప్రమాదవశాత్తు డీజిల్ ట్యాంకర్ పేలిన ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అండగా నిలిచారు. ప్రమాదం సంభవించిన అనంతరం మృతుల నివాసాలకు మంత్రి స్వయంగా వెళ్లి వారి కుటుంబాలను ఓదార్చి అండగా ఉంటామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక చొరవ చూపారు. సీఎం కేసీఆర్ను ఒప్పించి సీఎం సహాయనిధి ద్వారా ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున మంజూరు చేయించారు. సదరు చెక్కులను గురువారం ఆయన బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్తోపాటు మంత్రి జగదీశ్రెడ్డికి మృతుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.