వరంగల్: రాష్ట్రంలో మిర్చి, పత్తి ధర సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మిర్చి ధర రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో పసిడిను మించిపోయింది. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో దేశి రకం మిర్చి క్వింటాల్కు రూ.55,571 పలికింది. ఇప్పటివరకు మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక ధర అని అధికారులు వెల్లడించారు. కొన్ని రోజులక్రితం దేశిరకం మిర్చి ధర క్వింటాల్కు రూ.52 వేలు పలికిన విషయం తెలిసిందే.
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గోవిందపురం గ్రామానికి చెందిన పేరాల కిషన్ రావు అనే రైతు 30 బస్తాల మిర్చిని ఎనుమాముల మార్కెట్కు తీసుకువచ్చారు. దానిని శాంభవి ట్రేడర్స్ ఖరీదుదారులు క్వింటాల్కు రూ.55,571 చొప్పున కొనుగోలు చేశారు.
పత్తి ధర క్వింటాల్ రూ.12,110 పలికింది. ఇది కూడా ఆల్ టైమ్ రికార్డు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన రైతు కట్టయ్య తీసుకువచ్చిన ఆరు బస్తాల పత్తికి గణపతి సాయి ట్రేడర్స్ ఖరీదుదారులు క్వింటాల్ ధర రూ.12,110 చొప్పున కొనుగోలు చేశారు.