హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడ్డ మైనారిటీ విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించేలా శిక్షణ ఇవ్వాలన్న సమున్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన మైనారిటీ స్డడీ సర్కిళ్లు నిద్రావస్థలో కూరుకుపోతున్నాయి. హైదరాబాద్ మినహా ఉమ్మడి జిల్లాల్లోని సెంటర్లలో కనీస వసతులు కరువయ్యాయి. నాణ్యమైన ఫ్యాకల్టీతో కాకుండా తూతూమంత్రంగా కోచింగ్ ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నాయి. దీంతో జాతీయ స్థాయి యూపీఎస్సీ పరీక్షలతోపాటు గ్రూప్-1, 2, 4 తదితర రాష్ట్రస్థాయి పోటీపరీక్షల్లోనూ తేలిపోతున్నాయి. తాజాగా విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో మైనారిటీ వర్గానికి చెందిన ఒక్కరు కూడా రాణించకపోవడం ఇందుకు నిదర్శనం. గత రెండేండ్ల నుంచి సివిల్స్, ఇతర కాంపిటేటివ్ పరీక్షల్లోనూ ఇలాంటి ఫలితాలే పునరావృతమవుతున్నాయి.
హైదరాబాద్లో మైనారిటీ స్టడీ సర్కిల్కు సొంత భవనంతోపాటు సరిపడా సౌకర్యాలు ఉన్నప్పటికీ మిగిలిన ఉమ్మడి జిల్లాల్లోని సెంటర్లు అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య కొనసాగుతూ లైబ్రరీలను తలపిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో రాణించేలా శిక్షణ ఇచ్చేందుకు ఆ కేంద్రాల్లో సరైన ఫ్యాకల్టీని కూడా అందుబాటులో ఉంచడంలేదు. కోచింగ్ కోసం పత్రికలకు ప్రకటనలు ఇవ్వడం, దరఖాస్తులు స్వీకరించడం, ప్రవేశ పరీక్ష పెట్టి అభ్యర్థులను ఎంపికచేయడమే తప్ప వారికి నాణ్యమైన కోచింగ్ ఇవ్వడం లేదు. ఎంపికైన అభ్యర్థులకు అరకొరగా స్టడీ మెటీరియల్, మూడు నెలలపాటు రూ.5 వేల చొప్పున ైస్టెపెండ్ ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. కొందరు అభ్యర్థులను ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు పంపి, వారి శిక్షణ కోసం కేటాయించిన నిధులను కాజేస్తున్నారని, దీంతో ఆశించిన ఫలితాలు రావడం లేదని మైనారిటీ సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
సివిల్స్-2025 పరీక్షకు రాష్ట్రంలో హైదరాబాద్తోపాటు మిగిలిన తొమ్మిది సెంటర్లలో 100 మంది చొప్పున మైనారిటీ అభ్యర్థులను ఎంపికచేసి శిక్షణ ఇచ్చారు. కానీ, ఆ వెయ్యి మందిలో ఒక్క అభ్యర్థి మెయిన్స్కు మాత్రమే పరిమితమయ్యారు. కనీసం ఇంటర్వ్యూకు కూడా అర్హత సాధించ లేకపోయారు. దేశవ్యాప్తంగా మైనారిటీ వర్గానికి చెందిన 52 మంది అభ్యర్థులు సివిల్స్లో సత్తా చాటి వివిధ ఉద్యోగాలకు ఎంపికైతే తెలంగాణ నుంచి ఒక్క అభ్యర్థి మాత్రమే మెయిన్స్కు అర్హత సాధించడం గమనార్హం. భవిష్యత్లో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని మైనారిటీ సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
దేశంలో అత్యున్నతమైన సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో ఈసారి తెలంగాణలోని మైనారిటీ బిడ్డలకు చోటు దక్కకపోవడం దురదృష్టకరం. వారికి అత్యున్నత ఉద్యోగాలు అందని ద్రాక్షలా మారాయి. దేశవ్యాప్తంగా ఎంపికైన 52 మంది మైనారిటీల్లో మన రాష్ర్టానికి చెందిన ఒక్కరూ లేకపోవడం విస్మయం కలిగిస్తున్నది. నిరుడు కూడా ఇలాంటి ఫలితాలే వచ్చాయి. మైనారిటీ స్టడీ సర్కిళ్లలో సరైన వసతులు లేకపోవడం, మెరుగైన కోచింగ్ ఇవ్వకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరిచి మైనారిటీ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేయాలి. సివిల్స్తోపాటు ఇతర పోటీ పరీక్షల్లో రాణించేలా మైనారిటీ బిడ్డలకు మెరుగైన కోచింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. అందుకు అవసరమైనన్ని నిధులు కేటాయించాలి.