జహీరాబాద్, అక్టోబర్ 6 : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్న కలలు సాకారమవుతున్నాయి. పేదింటి బిడ్డల బంగారు భవిష్యత్తుకు గురుకులాలు బాటలు వేస్తున్నాయి. ఉన్నత విద్యకు ప్రతిభా కళాశాలలు చిరునామాగా నిలుస్తున్నాయి. అందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని అల్గోల్, బూచినెల్లి గ్రామ శివారులో (టెమ్రిస్) మైనార్టీ గురుకుల క్యాంపస్లే నిదర్శనం. ఈ రెండు క్యాంపస్ల నుంచే ఈ ఏడాది 16 మందికిపైగా విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లను సాధించడం తెలంగాణ గురుకుల విద్యావ్యవస్థకే గర్వకారణం. ఐఐటీ, మెడిసిన్ తదితర ఉన్నత విద్యాభ్యాసమనేది పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందని ద్రాక్ష. ఆర్థికంగా ఉన్న కుటుంబాలవారైతే పేరొందిన విద్యాసంస్థల్లో లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్ తీసుకోగలుగుతారు. కానీ, నిరుపేద, మధ్యతరగతి విద్యార్థుల పరిస్థితి అందుకు విరుద్ధం. అప్పు చేసి కోచింగ్ తీసుకోవాలి. లేదంటే ఆశయాన్ని వదులుకోవాల్సిందే. అలాంటి పేదింటి బిడ్డల ఆశయాలకు ఊపిరి పోసి, ప్రతిభకు మెరుగులు దిద్ది, వారి కలలను సాకారం చేయాలన్న ఉదాత్త లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వేలాది గురుకులాలను ఏర్పాటుచేసి ఇంటర్, డిగ్రీతోపాటు నాణ్యమైన విద్యను అందించింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల సొసైటీల ఆధ్వర్యంలో 66, మైనార్టీ సొసైటీ పరిధిలో 12 గురుకుల కళాశాలలను సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (ప్రతిభా కళాశాలలు)గా తీర్చిదిద్దింది. ఆయా ప్రతిభా కాలేజీల్లోకి మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి ఐఐటీ, జేఈఈ, నీట్తోపాటు జాతీయ, రాష్ట్రస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చేవిధంగా ఏర్పాట్లు చేసింది. పోటీపరీక్షలకు సంబంధించిన ఇంటెన్సివ్ కోచింగ్ను ఉచితంగా అందించింది. ఫలితంగా గత పదేండ్లలో గురుకులాల విద్యార్థులు రికార్డుస్థాయిలో ఉన్నత విద్యారంగంలోకి ప్రవేశించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన ఉన్నత విద్యాసంస్థల్లోనూ అడ్మిషన్లు పొందుతున్నారు. రాష్ట్రంలోని గురుకుల విద్యావ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్గా సీవోఈలు నిలిచాయంటే అతిశయోక్తి కాదు ఇప్పటివరకు అన్ని సీవోఈల నుంచి మొత్తంగా 1,500 మందికిపైగా విద్యార్థులు వైద్యరంగంలోకి ప్రవేశించడం కేసీఆర్ దార్శనికతకు అద్దం పడుతున్నది.
కేసీఆర్ దార్శనికతకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని అల్గోల్, బూచినెల్లి గ్రామ శివారులోని మైనార్టీ గురుకుల క్యాంపస్లు అద్దంపడుతున్నాయి. ఆయా కళాశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు జేఈఈ, నీట్ పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. దీంతో ఇక్కడి విద్యార్థులు వార్షిక పరీక్ష ఫలితాల్లో మంచి మార్కులతోపాటు జిల్లా, రాష్ర్టాస్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలోని అనేక ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ప్రవేశాలు పొందుతున్నారు. 2025 సంవత్సరానికిగాను నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షకు అల్గోల్, బూచినెల్లి గురుకుల బాలుర, బాలికల కళాశాలలకు చెందిన 76 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇటీవల విడుదలైన నీట్ పరీక్ష ఫలితాల్లో ఆయా కశాళాలలకు చెందిన 15 మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించి సత్తా చాటారు.
అంటే ఇక్కడ చదివిన ప్రతి ఐదుగురిలో ఒకరు డాక్టర్ కాబోతున్నారు. అల్గోల్ బాలుర గురుకుల కళాశాలకు చెందిన మహ్మద్ ఫిర్దోస్, ధర్మతేజ, సిద్ధి రమేశ్, ఎస్కే ఆయాన్, ఎండీ ఓబెద్, గౌతమ్ఖన్నా, సృజన్కుమార్ ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించారు. బూచినెల్లి గ్రామ శివారులోని మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన అస్మా ఫాతిమా, షేక్ సమీనా మర్ధార్, గాలి అనూష, తస్కీన్ ఖామర్, షాగుప్తా షాహీన్, ప్రియా అంజీల్, తస్లీం, సరేఖ మర్జాన్, ఫిర్ధోస్ ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించారు. గురుకుల కళాశాలలో చదివిన ఎంతోమంది విద్యార్థులు ఉన్నత చదువులతోపాటు రాష్ట్రస్థాయిలో ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధిస్తుండటం గర్వంగా ఉన్నదని ఆయా గురుకుల కళాశాల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ గొప్ప ఆలోచన, దూరదృష్టితో నిర్మించిన గురుకులాలు పేద, మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఇందులో చదువుకొన్న ఎందరో విద్యార్థులు ఇప్పుడు ఇంజినీర్లు, డాక్టర్లు, ఉన్నతోద్యోగులుగా సేవలందించడం గర్వకారణమని తెలిపారు. 2021లో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచినెల్లి మైనార్టీ గురుకులం ప్రారంభం సందర్భంగా ఓ విద్యార్థితో ముచ్చటించిన సన్నివేశాన్ని సోమవారం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘ఫ్యూచర్లో ఏం అవుతావమ్మా? అని అడిగిన ప్రశ్నకు డాక్టర్ను అవుతాను సార్ అని చెప్పిన ఫిర్దోస్ అనే విద్యార్థిని మాట నిలబెట్టుకున్నది.
కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సాధించింది’ అని హరీశ్రావు వెల్లడించారు. ఫిర్దోస్తోపాటు అదే మైనార్టీ గురుకులం నుంచి మరో ఎనిమిది మంది, అల్గోల్ మైనార్టీ గురుకుల నుంచి ఏడుగురు విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది విద్యార్థులు ఉన్నతస్థాయిలో స్థిరపడటం అభినందనీయమన్నారు. బీఆర్ఎస్ సర్కారు దూరదృష్టి, గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల విశ్వాసంవల్లే సాధ్యమైందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలన్న కేసీఆర్ కలలను నిరుపేద విద్యార్థులు సాకారం చేయడం గొప్ప విషయమని అభినందించారు.