బాన్సువాడ టౌన్, సెప్టెంబర్ 24 : వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని మరోసారి గెలిపించుకుంటామని ఆయా గ్రామాల వారు ప్రకటిస్తున్నారు. రోజురోజుకూ మద్దతు తెలిపే గ్రామాల సంఖ్య పెరుగుతున్నది. ఈ మేరకు బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్లోని మైనారిటీ వర్గానికి చెందిన 73 కుటుంబాల వారు స్పీకర్కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేసి ఆదివారం ఆయనకు ఆ పత్రాన్ని అందజేశారు. తమ గ్రామంలో మైనారిటీల కోసం ప్రత్యేకంగా ఫంక్షన్ హాల్ నిర్మాణానికి రూ.12 లక్షలు కేటాయించారని, నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేశారని వారు పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో స్పీకర్కు భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని వారు స్పష్టం చేశారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ శివారులోని కేసీఆర్ నగర్, పీఎస్ఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీ ప్రజలు స్పీకర్కు మద్దతుగా ఆదివారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. కాలనీల ప్రజలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తీర్మానం కాపీని స్పీకర్కు అందజేశారు.