హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : ‘దేశవ్యాప్తంగా కొత్తగా 21 సైనిక స్కూళ్లను మంజూరుచేశాం. రాష్ర్టాలవారీగా తెలంగాణ, ఏపీ, తమిళనాడుకు ఒకటి చొప్పున ఇచ్చాం. 2022-23 విద్యాసంవత్సరం నుంచి వీటిల్లో తరగతులు ప్రారంభమవుతాయి” ఇది సైనిక స్కూళ్లు మంజూరుచేసినప్పుడు కేంద్ర రక్షణశాఖ చేసిన ప్రకటన. కానీ, తెలంగాణకు మంజూరైన సైనిక్ స్కూల్ కాగితాలకే పరిమితమైంది. కొత్త సైనిక స్కూల్ ఏర్పాటులో కేంద్రం పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించింది. ఈ విద్యాసంవత్సరం 18 స్కూళ్లల్లోనే ప్రవేశాలకు అవకాశం కల్పించి.. తెలంగాణ సైనిక్ స్కూల్ను పూర్తిగా విస్మరించింది. అన్ని విషయాల్లో తెలంగాణపై పూర్తిగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ.. వివక్షను ప్రదర్శించిన కేంద్రం తాజాగా సైనిక్స్కూల్ విషయంలోనూ అదే వైఖరిని కనబరిచింది. ఈ లెక్కన తెలంగాణకు సైనిక్ స్కూల్ మంజూరైనట్టా? లేదా అన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది.
గతంలో ఉన్న 33 సైనిక స్కూళ్లతో పాటు కొత్తగా మంజూరుచేసిన 18 స్కూళ్లల్లోనే ప్రవేశాల గురించి నేషనల్ టెస్టింగ్ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్లో ప్రకటించారు. తెలంగాణ సైనిక్ స్కూల్ను ఈ నోటిఫికేషన్లో చేర్చలేదు. కాగా, తెలంగాణ వారికి ఏపీలోని సైనిక్ స్కూళ్లో ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు.
కొత్తగా అడ్మిషన్లు ప్రారంభించిన 18 సైనిక్ స్కూళ్లల్లో 11 స్కూళ్లను బీజేపీ పాలిత రాష్ట్రాలకే తరలించింది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, హర్యానాకు 2 చొప్పున, మధ్యప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్, హిమాచల్ప్రదేశ్కు ఒకటి చొప్పున స్కూళ్లను బీజేపీ పాలిత రాష్ర్టాలకే కేటాయించింది. మిగిలిన ఏడు బీజేపీయేతర ప్రభుత్వాలున్న బీహార్కు రెండు, తమిళనాడు, ఏపీ, దాద్రానగర్ హవేలి, పంజాబ్, కేరళ రాష్ర్టాలకు ఒకటి చొప్పున ఇచ్చారు.