Gangula Kamalakar : కరీంనగర్ నియోజకవర్గంలో మట్టి రోడ్డు అనేది కనిపించకుండా చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 85 శాతం మేర పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి రోడ్లు అద్భుతంగా నిర్మించామని తెలిపారు. మిగిలిన రోడ్లకు సంబంధించి ప్రతిపాదనలు పంపగా 406, 407 జీవోల కింద పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి శాఖల నుండి మొత్తం రూ. 75 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని మంత్రి వెల్లడించారు. వాటిలో రూ.59 కోట్ల 30 లక్షలతో కొత్తపల్లి, రూరల్ మండలాల్లో ఆరు కొత్త రోడ్లు వేస్తామని, వరదల కారణంగా దెబ్బతిన్న10 రోడ్లను బాగు చేస్తామని గంగుల పేర్కొన్నారు.
రూ.14 కోట్ల 78 లక్షలతో 8 ఆర్ అండ్ బి రోడ్లను రెన్యూవల్ పనులను డిసెంబర్ లో ప్రారంభించి మార్చ్ 31లోపు పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్లో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు సంబంధించి రూ.40 కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలు పంపామని, రేపు దానికి సంబంధించిన జీవో విడుదల అవుతుందని మంత్రి గంగుల తెలిపారు.