హైదరాబాద్ : రామానుజుల విగ్రహావిష్కరణతో ముచ్చింతల ప్రాంతం ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మారుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ముచ్చింతలలోని త్రిదండి రామానూజ చినజీయర్ స్వామి ట్రస్ట్ ప్రాంగణంలో ఉన్న రామానుజుల కాంస్య విగ్రహాన్ని, ఆలయాన్ని మంత్రులు సందర్శించారు. ఈ సందర్భంగా విగ్రహావిష్కరణ కోసం ప్రత్యేకంగా వేస్తున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ భారీ ఎత్తున నిర్మించిన రామానుల విగ్రహం మహిమాన్వితమైందిగా నిలిచిపోతుందన్నారు. సీఎం కేసీఆర్ సమన్వయం, సహకారంతో విగ్రహావిష్కరణ కార్యక్రమాలు గొప్పగా జరుగుతాయన్నారు. విగ్రహావిష్కరణకు భారత రాష్ట్రపతితో పాటు ప్రధాని, ప్రపంచవ్యాప్తంగా అతిరథ మహారథులు హాజరవుతారన్నారు. ఫిబ్రవరిలో విగ్రహావిష్కరణకు వచ్చే వారి కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. అంతర్గత రోడ్లు నిర్మిస్తున్నామని, ఇతర ఏర్పాట్లు సైతం ఘనంగానే ఉంటాయని మంత్రులు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక హబ్గా మారిన తెలంగాణకు రామానుజుల విగ్రహం మకుటాయమానం కానుందన్నారు.
సీఎం కేసీఆర్ తెలంగాణలోని దేవాలయాల పునరుద్ధరణ, పూర్ణోద్ధరణకు నడుం బిగించారన్నారు. యాదాద్రిని తీర్చిదిద్దుతున్న వైనాన్ని వివరించారు. అయితే, జీయర్ ట్రస్ట్ ప్రాంగణంలో సంప్రదాయం ఉట్టి పడేలా అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారని అభినందించారు. మంత్రులు సంబంధిత అధికారులకు ఏర్పాట్ల విషయమై తగు సూచనలు, సలహాలు చేశారు. పనులు వేగంగా, నాణ్యంగా జరగాలని ఆదేశించారు. కార్యక్రమంలో చినజీయర్ స్వామి, మై హోమ్స్ అధినేత రామేశ్వర్ రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.