Minister Srinivas Yadav | ప్రధానికి రాష్ట్రానికి వచ్చి ఏమైనా ప్రాజెక్టులు ఇస్తారనుకుంటే.. కేవలం తిట్టిపోయిండని మంత్రులు శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ విమర్శించారు. బీఆర్ఎస్ ఎల్పీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యలపై మంత్రులు విరుచుకుపడ్డారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ పాలనను ప్రధాని మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం తప్ప మోదీకి ఏమీ చేత కాదన్నారు. అదానీ కోసమే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని పక్కన బెట్టారని, బీజేపీ గతంలో కుటుంబ పార్టీలతో పొత్తు పెట్టుకోలేదా? అంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోతే కేంద్రం అవార్డులు ఎందుకు ఇస్తోందని ప్రశ్నించారు.
ఏ అంశంలోనైనా తెలంగాణతో ఇతర రాష్ట్రాలు పోటీ పడతాయా? అని ప్రశ్నించారు. దేంట్లోనైనా బీజేపీ పాలిత రాష్ట్రాలు ముందున్నాయా ? అని నిలదీశారు. మోదీ సీబీఐని గతంలో కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనలేదా..? అని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రతిపక్షాల తీరును తప్పుబట్టడం సమంజసమా..? కాళేశ్వరానికి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదన్నారు. జాతీయ రహదారులు తెలంగాణ హక్కు అన్నారు. సున్నం వేసి ఇల్లు నాదే అన్నట్టుగా మోదీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్రం ప్రాజెక్టులు చూసి నత్తలు కూడా సిగ్గు పడుతున్నాయన్నారు. ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఇంకా ఎంత సమయం తీసుకుంటారన్నారు. తెలంగాణ మీద మోదీ కక్ష మరోసారి బయటపడిందన్నారు. కేసీఆర్ది కుటుంబ పాలన కాదని, తెలంగాణ అంతా కేసీఆర్ కుటుంబమేనని, మోదీది ఆదానీ కుటుంబమని విమర్శించారు. మోదీ నిధులు ఇవ్వకున్నా పర్వాలేదని, మమ్మల్ని బద్నాం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.
ప్రధాని మోదీ పర్యటనలో అన్ని వర్గాలను నిరాశ పరిచారన్నారు. యాసంగి పంట కొనుగోలుపై మోదీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా రైతులను నిరాశ పరిచారని, రేషన్ కార్డుల సంఖ్యను మోదీ పెంచుతారనుకుంటే అది కూడా చేయలేదన్నారు. రేషన్ బియ్యంపై ప్రధాని పదవిలో ఉండి అబద్దాలు ఆడడం దురదృష్టకరమన్నారు. రేషన్ బియ్యం పేదలకు ఇవ్వకుండా ఎవరు అడ్డుకున్నారని, కుటుంబానికి బియ్యం కోటా పెంచింది రాష్ట్ర ప్రభుత్వం తప్ప కేంద్రం కాదన్నారు. రేషన్ బియ్యంపై రూ.27వేలకోట్లు ఖర్చు చేశామన్నారు. గురుకులాల గురించి మోదీ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. వ్యవసాయం, పీడీఎస్ గురించి మాట్లాడే అర్హత మోదీకి లేదన్నారు. వెనకబడిన వర్గాలకు మోదీ చేసింది శూన్యమన్నారు. వెనకబడిన వర్గాలకు విద్యను అందించింది కేసీఆరేనన్నారు. అవినీతి బీజేపీ సీఎంలపై సీబీఐ విచారణ ఎందుకు జరిపారన్నారు. మోదీ తెలంగాణకు ప్రాజెక్టులు ఇస్తారంటే ఎందుకు వద్దంటామన్నారు.