మహేశ్వరం, నవంబర్ 6: రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కు ఓటేయాలని గిరిజన సంక్షేమశాఖ, విద్యాశాఖల మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. గిరిజన బిడ్డలను ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. ఆరు శాతం ఉన్న రిజర్వేషన్ను రిజర్వేషన్ను 10 శాతానికి సీఎం కేసీఆరే పెంచారని చెప్పారు.
మహేశ్వరం మండలం తుక్కుగూడలో సోమవారం నిర్వహించిన గిరిజన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సత్యవతి మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు గిరిజనులను ఇప్పటి వరకు ఓటు బ్యాంకుగానే చూశారని విమర్శించారు. గిరిజనులకు పోడు భూముల పట్టాలను అందించిన ఘనత కూడా సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. రైతు బంధును ఎకరాకు రూ.16 వేలకు పెంచామని, గ్యాస్ సిలిండర్కు రూ.400లకే అందించనున్నామని తెలిపారు.
సేవాలాల్ భవనానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి రూ.2 కోట్లు ఇచ్చారని తెలిపారు. బీఆర్ఎస్తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ఆహర్నిశలు కృషిచేస్తున్న సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. గిరిజన గ్రామాల్లో గిరిజనులకు స్వయం పాలనను అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించి, ఆదరించాలని కోరారు. గిరిజన తండాల్లో రోడ్లు, మంచినీటి వసతులను కల్పించామని, తండాల్లోని పంచాయతీలకు పక్కా భవనాలను నిర్మిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, తుక్కుగూడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భవాని వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): గిరిజన ఆత్మగౌరవ సభ ఈ నెల 11న నిర్వహించనున్నట్టు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. శామీర్పేటలోని ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్లో మధ్యాహ్నం 2 గంటలకు సభ నిర్వహిస్తామని సోమవారం తెలంగాణభవన్లో మీడియాకు వెల్లడించారు. ఈ సభకు గిరిజన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరుకావాలని కోరారు. సర్పంచ్లు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, పీఏసీఎస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు హాజరుకావాలని కోరారు.
ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్, టీ హరీశ్రావు హాజరవుతారని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, బీఆర్ఎస్ కార్యదర్శి రూప్సింగ్, కరాటే రాజు, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్ రాంబాల్నాయక్, ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు, మీర్పేట మేయర్ దీప్లాల్నాయక్, బోడుప్పల్ కార్పొరేటర్ సుమన్నాయక్, గిరిజన నాయకులు పాల్గొన్నారు.