హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ప్రథమ శ్రేణిలో పాసైన అవిభక్త కవలలు వీణా-వాణీలను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ అభినందించారు. బుధవారం హైదరాబాద్లోని స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనరేట్ కార్యాలయంలో మంత్రులు వీణా-వాణీలతో ముచ్చటించారు. వారికి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మిగతా విద్యార్థులతో పోటీపడి కష్టపడి చదవటం ద్వారా ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో వీణకు 712, వాణికి 707 మారులు వచ్చాయని చెప్పారు. కొవిడ్ సమయంలో కూడా ఆన్లైన్ క్లాస్లకు హాజరై ఎప్పటికప్పుడు శ్రద్ధగా చదివి సాధారణ విద్యార్థులతో పోటీపడగలమని నిరూపించారని ప్రశంసించారు.
వీణావాణీ సీఏ కోర్సు చేయటానికి ఉత్సాహం చూపుతున్నారని, శ్రీమేధలో వారికి అడ్మిషన్ తీసుకొన్నామని చెప్పారు. వారికి దేవుడు అన్యాయం చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారని తెలిపారు. వీణావాణీలతోపాటు బాలసదనంలో అనాథ పిల్లలు కూడా ఉన్నారని, వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ వీణావాణీలు ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారని అభినందించారు. విద్యార్థులంతా ఈ కవలలను ఆదర్శంగా తీసుకోవాలని, పరీక్షల్లో ఫెయిలైనంత మాత్రాన తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని సూచించారు. ఇంటర్ విద్యార్థులు ఏడాది నష్టపోకుండా అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్లు కేఆర్ఎస్ లక్ష్మీదేవి, సునంద తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా గిరిజన గురుకులాల్లో విద్యాబోధన ఉన్నదని, ఇందుకు ఇంటర్ ఫలితాలే నిదర్శనమని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన గిరిజన గురుకుల విద్యార్థులను బుధవారం మాసబ్ట్యాంక్లోని సంక్షేమభవన్లో మంత్రి అభినందించారు. వివిధ గ్రూప్లలో ప్రథమస్థానంలో నిలిచిన ఇంటర్ విద్యార్థులకు రూ.25 వేలు, ద్వితీయ స్థానం విద్యార్థులకు రూ.15 వేల చొప్పున ప్రోత్సాహకం కింద చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ వాల్యా నాయక్, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, గురుకుల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రోస్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజనులు సేకరించిన ముడి తేనెను (ఎటువంటి ప్రాసెసింగ్ చేయకుండా) మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం మార్కెట్లోకి విడుదల చేశారు. నువ్వులు, మామిడి, వేప, పాల కొడిష రకాల తేనె ప్యాకెట్లు హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని సంక్షేమభవన్ జీసీసీ స్టోర్స్లో అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. ఈ తేనె జూలై 15 నుంచి క్యూ మార్ట్, ప్లిప్ కార్డు ద్వారా కొనుగోలు చేయొచ్చన్నారు.