Minister Satyavathi | గూడానికో సేవలాల్ గుడి కట్టిస్తామంటున్న బీజేపీకి గిరిజనులపై అసలు చిత్తశుద్ధి ఉందా? అని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Ministers Satyavathi) ప్రశ్నించారు. జనగామ జిల్లా పాలకుర్తి సబ్స్టేషన్ వద్ద ఎకరం స్థలంలో రూ.2కోట్ల వ్యయంతో బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహరాజ్ ఆలయం (Sant Sevalal Maharaj Temple), మేర మా యాడి ఆలయంతో పాటు ఆత్మగౌర భవానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ( Minister Errabelli Dayakar Rao)తో కలిసి భూమిపూజ చేశారు.
కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, జ్పడీ చైర్పర్సన్ అంగోత్ బిందు, మాజీ ఎంపీ సీతారాం నాయక్, జనగామ కలెక్టర్ శివ లింగయ్య, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు. అంతకు ముందు పాలకుర్తి చౌరస్తా నుంచి ఆలయ నిర్మాణ స్థలి వరకు వరకు లంబాడాల సంప్రదాయ పాటలు, నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. గిరిజనులతో కలిసి మంత్రులు కాలు కదిపారు. అలాగే వాహనాల భారీ ఊరేగింపు సాగింది. ఈ సందర్భంగా సభలో పలువురు ఉద్యోగులు, ప్రముఖులు విరాళాలు ప్రకటించారు.
అలాగే ఆత్మహత్యకు యత్నించిన కేఎంసీ మెడికో ప్రీతి కోలుకోవాలని పూజలు, ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలకుర్తి, గిరిజన లంబాడీలకు ఇదో సుదినమన్నారు. సేవాలాల్, మేర మా యాడి ఆలయాలను రూ.2కోట్లతో నిర్మించుకోనుండడం అదృష్టమన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాలకుర్తిని వేలకోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. బంజారా భవన్ కోసం రూ.1.50కోట్ల కేటాయించనున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కువ మంది మాట్లాడే మా లంబాడా భాషకు లిపి లేదని, 8వ షెడ్యూల్లో చేర్చి, భాషను జాతీయ భాషగా గుర్తించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 1961 జనాభా లెక్కల ప్రకారం 7.5 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని, గత 50 సంవత్సరాలుగా మళ్లీ పెంచలేదన్నారు.
200 కులాలను ఎస్టీల్లో కలిపారన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లను పెంచారని, ఓ బీజేపీ ఎంపీ గిరిజనులకు రిజర్వేషన్లు అవసరం లేదన్నారని గుర్తు చేశారు. ఇది బీజేపీ అభిప్రాయమా?.. ఆ ఎంపీ అభిప్రాయమా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సేవాలాల్ వంటి వారేనని, ఆయన తరహాలోనే కేసీఆర్ జాతి కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఏ జాతిలో పుట్టామనేది ముఖ్యం కాదని, ఏం చేస్తున్నామనేది కీలకమన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమానంగా పథకాలను అమలు చేస్తున్నారన్నారు.
మంత్రి దయాకర్రావు సేవాలాల్, మేర మా గుడి కట్టాలని చాలాకాలం నుంచి అనుకున్నట్లు తెలిపారు. పాలకుర్తి ప్రాంతానికి, గిరిజనులకు ఎంతో చరిత్ర ఉందన్నారు. రామాయణం రాసిన వాల్మీకి నడయాడిన నేల అని, ఆదికవి సోమనాథుడు ఇక్కడే పుట్టాడన్నారు. భాగవతం రాసిన బమ్మెర పోతన ఈ ప్రాంతంవాడేనన్నారు. ఈ అందుకే ఈ ప్రాంతాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా సీఎం కేసీఆర్ సహకారంతో రూ.100కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే సేవాలాల్, మేర మా గుడిని నిర్మిస్తున్నామన్నారు. పర్యాటకుల కోసం రూ.25కోట్లతో హోటల్ను కడుతున్నామన్నారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక పంచాయతీరాజ్ శాఖ ద్వారా 3,145 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామన్నారు. ఆయా తండాల్లో గిరిజనులే సర్పంచులు అయ్యారన్నారు. రిజర్వేషన్లు పెంచిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. సేవాలాల్ ఎంతో గొప్ప వ్యక్తని, ఆయన బోధనలు గిరిజనులకు గిరిజనులకే కాకుండా యావత్ సమాజ హితమైనవన్నారు. అందుకే సీఎం ప్రభుత్వ పరంగా సేవాలాల్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వమే పండుగలు చేసే, సంప్రదాయం దేశంలో తెలంగాణలో తప్ప ఎక్కడా లేదన్నారు. ప్రీతి కోలుకోవాలని కోరుకుంటున్నానని, నా బిడ్డ పేరు కూడా ప్రీతి అని తెలిపారు. ప్రీతిని నా బిడ్డ లాగా చూసుకుంటానని, ఆ కుటుంబాన్ని తన కుటుంబంగా ఆదుకుంటానన్నారు. సేవాలాల్ జయంతి సందర్భంగా సెలవు కావాలని అడిగారని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.