తాడ్వాయి, ఫిబ్రవరి19: రెండేండ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మల మహాజాతర ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.110 కోట్లు ఖర్చు చేస్తుందని రెవెన్యు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి దనసరి సీతక్క తెలిపారు. జాతరను అద్భుతంగా నిర్వహిస్తామని, భక్తుల కోసం సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మంత్రి పొంగులేటి హెలికాప్టర్లో మేడారం చేరుకోగా, అప్పటికే మంత్రి సీతక్క, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీశ్ ఏర్పాట్లలో ఉన్నారు.
అనంతరం వనదేవతలు సమ్మక్క, సారలమ్మ దర్శనానికి మంత్రులు, జిల్లా అధికారులు చేరుకోగా, దేవాదాయశాఖ అధికారులు, పూజారులు ఘన స్వాగతంతో తల్లుల గద్దెల వద్దకు తీసుకువెళ్లారు. ఈసందర్భంగా మంత్రి పొంగులేటి అమ్మవార్లకు ఎత్తుబెల్లం సమర్పించారు. గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం గద్దెల ప్రాంగణంలో మీడియాతో మంత్రులు మాట్లాడారు. జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మంత్రులు చెప్పారు. మహాజాతరలో భాగంగా అమ్మవార్లను దర్శించుకునేందుకు 2 కోట్ల మంది భక్తులు తరలివస్తారనే అంచనాలు ఉన్నాయని, అందుకు తగ్గట్టుగానే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. వీఐపీలు తమ వాహనాల్లో ములుగు వరకు వచ్చి అక్కడే పార్కింగ్ చేసి ఆర్టీసీ బస్సులోనే మేడారానికి రావాలని కోరారు. మహాజాతర పూర్తయిన తర్వాత ఖర్చులన్నీ ప్రజల ముందుంచుతామని, మిగతా సొమ్ముతో జాతరలో శాశ్వత నిర్మాణాలు చేపడుతామని తెలిపారు.