హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఏరువాక పున్నమి వేడుకలు పండుగలా కొనసాగాయి. రైతులందరూ తమ ఎద్దులను అలకరించి, నాగలితో పొలాలకు వెళ్లారు. తొలకరి పలుకరించిన భూముల్లో రైతులు నాగలితో దున్ని పంటల వేసేందుకు శుభారంభం పలికారు.
అయితే ఈ ఏరువాక పున్నమి వేడుకల్లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లవాడలో మంత్రి నిరంజన్ రెడ్డి ఎద్దుకు పూజ చేసి.. నాగలితో పొలం దున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం గాజుల మల్కాపురంలో ఏరువాక పున్నమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి జగదీశ్ రెడ్డి రైతులతో కలిసి పాడికి , భూ తల్లికి, నాగలి, వ్యవసాయ పనిముట్లకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాజాక్, జడ్పీటీసీ అనిత, ఎంపీపీ నెమ్మది భిక్షం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లలిత ఆనంద్తో పాటు పలువురు పాల్గొన్నారు.