హైదరాబాద్ : మాజీ మంత్రి మొహ్మద్ ఫరీదుద్దీన్ బుధవారం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతికి పలువురు తెలంగాణ మంత్రులు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రి మృతి వార్తను తెలుసుకున్న మంత్రి హరీశ్రావు హైదరాబాద్లోని ఆసుపత్రికి వెళ్లారు. మృతికి గల కారణాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఫరీదుద్దీన్ భౌతికకాయానికి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి, ఎమ్మెల్సీగా ఫరీదుద్దీన్ ఎంతో కృషి చేశారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు కొనియాడారు. మెదక్ జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయనతో కలిసి పని చేసిన అనుభవం ఉందని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మాజీ మంత్రి ఫరీదుద్దీన్ మైనారిటీల సంక్షేమానికి కృషి చేశారని హోంశాఖ మంత్రి హమ్మద్ మహమూద్ అలీ అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. తనతో పాటు ఎమ్మెల్సీగా పని చేశారని గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజల మనసుల్లో మంచి పేరుతెచ్చుకున్నారన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా మైనార్టీల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అలాగే రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దయాకర్రావు ఫరీదుద్దీన్ కుటుంబానికి సంతాపం ప్రకటించారు. మంత్రిగా ఉమ్మడి ఏపీలో ప్రజలకు ఎన్నో సేవలను చేశారన్నారు.