నమస్తే తెలంగాణ నెట్వర్క్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కోచింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లోని నిరుద్యోగుల సౌకర్యార్థం సొంత ఖర్చులతో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయిస్తూ గ్రామీణ యువతకు చేయూతనందిస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి వేముల
నిజామాబాద్ జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కానిస్టేబుల్ పోస్టుల కోసం ఉచిత శిక్షణ తరగతుల ఏర్పాటుకు నిర్ణయించారు. ఆదివారం వేల్పూర్ మండల కేంద్రంలోని తన నివాసంలో నిజామాబాద్ సీపీ నాగరాజుతో కలిసి శిక్షణకు సంబంధించిన వెబ్సైట్ను మంత్రి ప్రారంభించారు. స్థానికులకు కొలువులు దక్కాలనే తపనతో సీఎం కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు కృషిచేశారని పేర్కొన్నారు. దీనిని యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
4 నుంచి 90 రోజులు ఉచిత శిక్షణ: ఎమ్మెల్యే ఆరూరి
హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో గల నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తెలిపారు. ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 4 నుంచి 90 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఆదివారం తెలిపారు. ఆసక్తిగలవారు అన్ని మండల కేంద్రాలు, హనుమకొండ హంటర్ రోడ్డులోని క్యాంప్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
రెండు వేల మందికి కోచింగ్ : ఎమ్మెల్యే కంచర్ల
మంత్రి కేటీఆర్ పిలుపులో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్హాల్లో భవిత ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా 2 వేల మందిని ఎంపిక చేసి ఉచిత శిక్షణ, మెటీరియల్ అందిస్తామని ఎమ్మెల్యే కంచర్ల చెప్పారు. అవసరమైతే మరో వెయ్యి మందికి సైతం శిక్షణ ఇప్పిస్తామని ప్రకటించారు.
80 వేల పోస్టుల్లో మీదొకటి అనుకోండి
రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయబోయే పోస్టుల్లో ఒక పోస్టు తమదే అన్నట్టు యువత సిద్ధం కావాలని కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. కరీంనగర్లోని శుభం గార్డెన్స్లో తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం, శాతవాహన యూనివర్సిటీ సంయుక్తాధ్వర్యంలో ఆదివారం యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉన్నత లక్ష్యంతో సాగితే అనుకొన్నది సాధించవచ్చని కలెక్టర్ సూచించారు. అభ్యర్థులు పోటీ పరీక్షలపై పూర్తి అవగాహనతో ప్రిపేర్ కావాలని ఎస్యూ వీసీ ప్రొఫెసర్ మల్లేశం సూచించారు. సలహాలు, సూచనల కోసం తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పారు. నిరుద్యోగుల అనుమానాలు, సందేహాలు నివృత్తిచేసి, వారు ఉద్యోగాలు సాధించేలా కృషిచేయాలనే గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ నుంచి ప్రారంభిస్తున్నట్టు గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ చెప్పారు.