వరంగల్ : పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. పోడు వ్యవసాయదారులకు సమస్యలు, అటవీ సంపద అన్యాక్రాంతం కాకుండా చేపట్టే సంరక్షణ చర్యలపై హన్మకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమన్వయ సమావేశం జరిగింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సమావేశానికి హాజరైన ప్రజా ప్రతినిధులు సలహాలు, సూచనలు అందించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ సుదీర్ఘమైన పోడు సమస్య శాశ్వత పరిష్కారానికై సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, అందుకు అనుగుణంగా అటవీ హక్కుల చట్టం-2005 నియమ, నిబంధనల ప్రకారం పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికి శాశ్వతం పరిష్కారం దిశగా సమస్యకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదన్నారు. పోడు వ్యవసాయదారులకు న్యాయం చేసేందుకు అడవులను సంరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, అటవీ హక్కుల చట్టం-2005 పరిధికి లోబడి పోడు వ్యవసాయదారులకు న్యాయం చేకూర్చేందుకు సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇకముందు అడవుల నరికివేతకు పాల్పడే వారిపై కఠిన చర్యలుంటాయన్నారు. అడవుల నరికివేతతో వాతావరణ సమతౌల్యం దెబ్బతింటుందన్నారు. ప్రతి ఒక్కరూ అడవుల సంరక్షణకు కట్టుబడి ఉండాలని, మానవ, జీవజాతుల మనుగడ అడవుల సంరక్షణపై ఆధారపడి ఉందన్నారు. అడవుల క్షీణతతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, పర్యావరణ సమస్యలు వస్తున్నాయని అన్నారు. అడవుల పునరుద్ధరణలో దేశంలో రాష్ట్రం ముందుందన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి రాజకీయాలకు తావు లేకుండా పారదర్శకంగా అర్హులైన గిరిజనులు, గిరిజనేతరులకు అటవీ హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ పోడు భూముల పట్టాల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో140 జారీ చేసిందని, ఇందుకు అనుగుణంగా అధికారులు ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా అటవీ సంపదను కాపాడుకోవడంతో పాటు, భవిష్యత్లో ఆక్రమణకు గురవకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పోడు భూముల పట్టాలు అందించి హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ, రెవెన్యూ అధికారులు క్షేత్ర పర్యటనకు వెళ్లిన సమయంలో ఎఫ్ఆర్సీ కమిటీకి సమాచారం అందించడంతోపాటు రిజిస్టర్లో వివరాలు నమోదు చేయాలన్నారు.
గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, బీట్అధికారి క్షేత్ర పర్యటనకు వెళ్లిన సమయంలో సంబంధిత కోఆర్డినేటర్ ద్వారా జీపీఎస్ నమోదు చేయాలని, సర్వే బృందం ప్రతిరోజు దరఖాస్తులను పరిశీలించాలని సూచించారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి.. సర్వే పనులను ప్రారంభించాలన్నారు. సమావేశంలో మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జడ్పీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, నర్సంపేట ఎమ్మేల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ గోపి, ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో అంకిత్, అటవీ, రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.