రవీంద్రభారతి, ఏప్రిల్ 3: తెలంగాణలో బహుజన మహనీయులకు గొప్ప చరిత్ర ఉన్నదని, వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ సముచితంగా గౌరవిస్తున్నారని మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, వీ శ్రీనివాస్గౌడ్, మహమూద్ అలీ కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య చరిత్రను గత పాలకులు కనీసం పాఠ్య పుస్తకాల్లో కూడా చేర్చలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య 96వ జయంతి వేడుకలను సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, వీ శ్రీనివాస్గౌడ్, మహమూద్అలీ, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, సభ్యులు కే కిశోర్గౌడ్, ఉపేంద్రాచారి, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్యాదవ్ తదితరులు పాల్గొని దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి, అమరుడైన దొడ్డి కొమురయ్య బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి కృషిచేశారని చెప్పారు. ట్యాంక్బండ్పై కొమురయ్య విగ్రహాన్ని స్థాపించడానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక సోషల్ మీడియాలో నరంలేని నాలుకలు ఎన్నో మాట్లాడుతున్నాయని మంత్రి తలసాని విమర్శించారు. 45 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ నాయకులు నీళ్లు ఇచ్చారా? కరెంటు ఇచ్చారా? రైతుబంధు ఇచ్చారా? ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని పాదయాత్రలు చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం 99 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే.. టీఎస్పీఎస్సీలో ఎవరో ఇద్దరు చేసిన చెడు పనికి కొందరు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను తిడుతున్నారని మండిపడ్డారు. రైతుబంధు, దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై లేనిపోని బురదజల్లుతున్నారని విమర్శించారు. బీజేపీ మతకలహాలు సృష్టిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, గొల్ల కురుమ నాయకులు బండారు నారాయణ, క్యామ మల్లేశం, కొలువుల నరసింహ, ఎక్కల కన్నా, కొండల్రాజు, వినోద్కుమార్, బాలామణి, మిరియాల విజయ్, బీసీ సంఘం నేత గొరిగే మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటం మొదలైంది దొడ్డి కొమురయ్య కుటుంబం నుంచే అని మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ వివరించారు. తెలంగాణకు చెందిన మహనీయులు దొడ్డి కొమురయ్య, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్, చాకలి ఐలమ్మ లాంటి త్యాగమూర్తులను గుర్తించి, గౌరవించిన గొప్ప వ్యక్తి సీఎం కేసిఆర్ అని కొనియాడారు. బహుజనులు రాజకీయంగా సంఘటితంగా ఉంటే పదవులు వాటంతట అవే వస్తాయని చెప్పారు. వకుళాభరణం కృష్ణమోహన్రావు మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి దొడ్డి కొమురయ్య ఎంతో కృషి చేశారని, తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టి నైజాం పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన గొప్ప పోరాటయోధుడు అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహనీయుల జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషదాయకమని చెప్పారు. యెగ్గె మల్లేశం మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య జయంతిని ప్రభుత్వం అధికారింగా నిర్వహించడానికి జీవో ఇచ్చిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.